ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేపలు పట్టేందుకు మంజీరా నదికి మత్స్యకారులు.. అక్కడున్నది చూసి పరుగో పరుగు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2024, 06:24 PM

ఎప్పటిలాగే.. పొద్దుపొద్దున్నే.. చేపలు పట్టేందుకు మత్స్యకారులంతా కలిసి మంజీరా నదికి వెళ్లారు. ఈరోజు ఎలాగైనా నిన్నటి కంటే ఎక్కువ చేపలు పట్టుకెళ్లాలని ముచ్చట్లు పెట్టుకుంటూనే.. వలలతో సిద్ధమయ్యారు. నదిలో దిగేందుకు వెళ్తున్న సమయంలో.. దగ్గర్లో ఉన్న ఓ బండరాయిపై కదులుతున్న భారీ రూపాన్ని చూశారు. అది చూడగానే మత్స్యకారుల గుండెలు ఒక్కసారిగా కడుపులోకి జారాయి. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు లంకించుకున్నారు. ఇంతకూ ఆ మత్స్యకారులు అక్కడ ఏం చూశారనే కదా మీ డౌటనుమానం. అయితే ఈ స్టోరీ చదివేయండి.


సంగారెడ్డి జిల్లా హత్నూర మండంలం పన్యాల గ్రామ శివారులో ఉన్న మంజీరా నదిలో చేపలు పట్టేందుకు కొందరు మత్స్యకారులు ఉదయం పూట సరంజామాతో వెళ్లారు. చేపలు పట్టేందుకు అంతా సిద్ధమై.. నదిలో దిగేందుకు వెళ్తుండగా.. దగ్గరలో ఉన్న ఓ బండరాయిపై ఓ భారీ రూపం కదులుతూ కనిపించింది. ఏంటబ్బా అని చూస్తే.. భారీ మొసలి ఎంచక్కా సేద తీరుతోంది. దీంతో.. ఆ మత్స్యాకారులు గుండెలు గుబెల్‌మన్నాయి. వెంటనే తెచ్చుకున్న వలలు, సంచులు అన్నీ అక్కడే వదిలేసి.. భయంతో అక్కడి నుంచి పరుగో పరుగు. ఏమైంది ఎందుకలా భయంతో పరుగులు పెడుతున్నారని స్థానికులు అడగ్గా.. నదిలో ఉన్న మొసలి గురించి వివరించారు. దీంతో.. స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


రోజూ మంజీరా నదిలో చేపలు పట్టుకునేందుకు వెళ్తామని.. కానీ ఇన్ని రోజులు నదిలో మొసలి ఉందని మాత్రం గుర్తించలేక పోయామని మత్స్యకారులు తెలిపారు. ఇన్ని రోజులుగా చేపల వేటకు వెళ్తున్నా తమకు మొసలి కనిపించలేదని.. ఈరోజే కంటపడిందని తెలిపారు. అధికారులు మొసలిని పట్టుకుని ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని మత్సకారులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.


అయితే.. మంజీరా నదిలో కనిపించిన ఒక్క మొసలే ఉందా.. లేక ఇంకా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అయితే.. ఆ ప్రాంతంలో ఉన్న యువత కూడా.. రోజూ సాయంత్రం సేద తీరేందుకు నదీ గట్టుకు వెళుతుంటారని స్థానికులు చెప్తున్నారు. చాలా మంది కాలక్షేపానికి నదివైపు వస్తుంటారని తెలిపారు. నదిలో మొసలి ఉండటం ఎప్పటికైనా ప్రమాదమే అని.. వెంటనే అధికారులు స్పందించి మొసలిని అక్కడి నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.


ఇటీవల నదీ తీరాల్లో, పెద్ద చెరువులు, సరస్సుల్లో మొసళ్లు విరివిగా కనిపిస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లోనో, అలికిడి లేని చెరువుల్లోనో కాకుండా.. జనసంచారం ఎక్కువగా ఉంటే పల్లెల్లు, పట్టణాల్లోనూ మొసళ్లు కనిపిస్తుండటం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. మొన్నటివరకు.. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదల వల్ల మొసళ్లు పట్టణాల్లోకి వచ్చాయనుకుంటే.. ఇప్పుడు ఎలాంటి వర్షాలు, వరదలు లేకున్నా.. జనసంచారం ఉండే ప్రదేశాల్లో కనిపిస్తుండటం గమనార్హం.


మొన్నామధ్య.. ఓ మొసలి ఓ వ్యక్తి ఇంటి ప్రాంగణంలో కనిపించటం కలకలం రేపింది. ఉదయాన్ని వాష్‌రూమ్‌కు వెళ్తున్న సమయంలో బాత్‌రూమ్ పక్కనున్న గల్లీలో ఓ భారీ ఆకారం కదులుతూ కనిపించేసరికి.. ఏంటా అని చూస్తే భారీ మొసలి కనిపించింది. దీంతో.. వెంటనే స్థానికులకు, అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా.. దాన్ని తీసుకెళ్లి ఓ చెరువులో వదిలిపెట్టారు. అయితే.. ఆ మొసలి జనావాసాల్లోకి ఎలా వచ్చిందన్నది వాళ్లకు అర్థం కాని విషయం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa