పదేండ్లలో తెలంగాణ పెట్టుబడి వ్యయం 4 లక్షల కోట్లు ఏడు రెట్లు పెరిగిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కరోనా కాలంలోనూ వెనుకడుగు వేయని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 12వ స్థానం పదేండ్లలోనే 7 స్థానాలు పైకి.. ఆర్బీఐ నివేదిక వెల్లడి పూర్తయిన పెండింగ్ ప్రాజెక్టులు.. పెరిగిన కనెక్టివిటీ ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా బలపడాలంటే మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండేచర్) ఎంతో ముఖ్యం. డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడి పెట్టి.. తద్వారా సంపదను సృష్టించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇదే ప్రధాన మార్గం. మూలధన వ్యయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నా.. సొంత కాళ్లపై నిలబడి ఆర్థికంగా అభివృద్ధి చెందింది. అన్ని మార్గాల్లో వచ్చిన ఆదాయంలో సింహభాగం మూలధన వ్యయం కింద ఖర్చు చేసింది. క్యాపిటల్ ఎక్స్పెండేచర్లో.. 2014లో దేశంలో 12వ స్థానం ఉన్న తెలంగాణ 2023-24 బడ్జెట్ లెక్కల ప్రకారం ఐదో స్థానంలో నిలిచింది. దీనిని బట్టే ఏటేటా పెట్టుబడి వ్యయం ద్వారా సంపద సృష్టిస్తూ.. తిరిగి పెట్టుబడి రూపంలో పెట్టిందని స్పష్టం అవుతున్నది. ప్రణాళికాబద్ధమైన రహదారుల నిర్మాణం, నిర్వహణ రాష్ట్ర ప్రగతికి దన్నుగా నిలుస్తుందని కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. అందుకే రహదారుల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టిపెట్టింది. రోడ్ నెట్వర్క్ను పెంచితే కలిగే ప్రయోజనాలపై లోతుగా అధ్యయనం చేసింది. రహదారుల అభివృద్ధిపైనే మిగతా రంగాల ప్రగతి ఆధారపడి ఉంటుందని అంతర్జాతీయంగా వినిపిస్తున్న సూత్రం. అందుకే కేసీఆర్ ప్రభుత్వం క్షేత్రస్థాయి రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చింది. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు సింగిల్లైన్ డాంబర్ రోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు కనీసం డబుల్లైన్ డాంబర్ రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు నాలుగు లైన్ల రోడ్లు వేయాలని నిర్ణయించి.. అమలు చేసింది. ప్రధానంగా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లోనూ రూ.634 కోట్ల ఖర్చుతో 426 కిలోమీటర్ల పొడవైన రహదారులు, 22 బ్రిడ్జీలను నిర్మించింది. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో జాతీయ రహదారులు 2,511 కిలోమీటర్లు, రాష్ట్ర రహదారులు 4,983 కిలోమీటర్లు మాత్రమే ఉండేవి. గత సంవత్సరం నాటికి రాష్ట్రంలో రోడ్ నెట్వర్క్ ఏకంగా 32,717 కిలోమీటర్లకు పెరిగింది. ఇందులో రాష్ట్ర రహదారులు 27,734 కిలోమీటర్లు జాతీయ రహదారులు 4,983 కిలోమీటర్లకు పెరిగాయి. పదేండ్లలో 23 ఆర్వోబీలు, ఆర్యూబీలను నిర్మించింది. ఫలితంగా ప్రజలకు కనెక్టివిటీ పెరగడంతోపాటు పంట ఉత్పత్తులను, పారిశ్రామిక ఉత్పత్తులను వేగంగా డెలివరీ చేసే అవకాశం లభించింది. కరోనా కాలంలోనూ తగ్గలేదు 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం మొదలైంది. ఇదే సమయంలో కరోనా విజృంభించి, ప్రపంచం మొత్తం ఆర్థికంగా కుదేలైంది. దేశంలోనూ ఆర్థిక వృద్ధి మందగించింది. అయినా తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. మూలధన వ్యయం కింద ప్రాజెక్టులు కొనసాగించేందుకే మొగ్గు చూపింది. ప్రజలకు ఉపాధి కల్పించడంతోపాటు ఆస్తులు సృష్టించడం సాధ్యమని నమ్మింది. కరోనా కష్టపెట్టిన 2019-20 ఆర్థిక సంవత్సరంలోనూ రూ.34,051 కోట్లు, ఆ మరుసటి సంవత్సరం రూ.34, 327 కోట్లు పెట్టుబడి వ్యయానికి కేటాయించారు. ఈ నిధులతో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం వంటి వసతులు వంటివి కల్పించారు. ఫలితంగా పనులు వేగంగా కొనసాగి, ప్రాజెక్టులు పూర్తయ్యాయి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి తెలంగాణ ఏర్పడేనాటికి 20 లక్షల ఎకరాలకే సాగునీరు అందేది. పదేండ్ల తర్వాత 1.03 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ఇందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు అనేక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టులు చేపట్టి విజయవంతంగా సాగునీరు అందించడం, చెరువుల పునరుద్ధరణ, చెక్డ్యామ్ల నిర్మాణం వల్లే సాధ్యం అయ్యింది. మిషన్ కాకతీయ ద్వారా 27,325 చెరువులను పునరుద్ధరించింది. ఇందుకు దాదాపు రూ.9వేల కోట్లు వెచ్చించింది. ఫలితంగా 9.61 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. రూ.3,850 కోట్లతో 1,200 చెక్డ్యామ్ల నిర్మాణం చేపట్టింది. 638 చెక్డ్యామ్లను పూర్తి చేయడంతో 1.25 లక్షల ఎకరాలకు సాగునీటి భరోసా లభించింది. భూగర్భ జలాలు పెరిగాయి. మరో రూ.316.67 కోట్లు వెచ్చించి కాలువలు, తూములకు మరమ్మతులు చేసింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు పదేండ్లు, ఏర్పాటు తర్వాత పదేండ్లలో చేసిన ఖర్చు, జరిగిన అభివృద్ధిని చూస్తే అర్థం అవుతుంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు.. 2004-14 మధ్య ఇరిగేషన్ ప్రాజెక్టులకు వెచ్చించిన నిధులు ; 38,405.12 కోట్లు కొత్తగా వచ్చిన ఆయకట్టు ; 5.71 లక్షల ఎకరాలు తెలంగాణ ఏర్పాటు తర్వాత.. పదేండ్లలో ప్రాజెక్టులపై వెచ్చించిన మొత్తం ; 1,64,210 కోట్లు 2014-23 మధ్య సాగులోకి తీసుకొచ్చిన ఆయకట్టు ;17.23 లక్షల ఎకరాలు విద్యుత్తు సరఫరా మెరుగు ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కోతలతో సామాన్య ప్రజల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు రోడ్ల మీద ధర్నాలు చేసిన పరిస్థితి. జనరేటర్లు రాజ్యమేలాయి. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. విద్యుత్తు వ్యవస్థాపక సామర్థ్యాన్ని పెంచడంతోపాటు సరఫరాను మెరుగుపరిచింది.ఇందుకోసం రూ.39,321 కోట్లు ఖర్చు చేసింది. కొత్తగా 1,062 సబ్స్టేషన్లు (33/11 కేవీ), 3.89 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 1.83 లక్షల కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ లైన్లు ఏర్పాటు చేసింది. ఫలితంగా ఇండ్లకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్తు సరఫరా సాధ్యం అయ్యింది. 2021-22లో దేశంలోనే అత్యధిక తలసరి విద్యుత్తు వినియోగం ఉన్న రాష్ట్రంగా నిలిచింది. స్థాపిత విద్యుత్తు సామర్థ్యం ఇలా.. తెలంగాణ ఏర్పడేనాటికి 7,778 మెగావాట్లు 2023 మే నాటికి18,567 మెగావాట్లు మౌలిక వసతులకు పెద్దపీట కేసీఆర్ ప్రభుత్వం రాష్ర్టానికి వచ్చిన ఆదాయంతోపాటు అప్పుల రూపంలో తెచ్చిన నిధులను కలిపి మూలధన వ్యయం కింద మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసింది. ఆస్తులను సృష్టించింది. దీంతో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. చెరువులు బాగు పడ్డాయి. దాదాపు 23వేల కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు నిర్మితమయ్యాయి. హైదరాబాద్లో నూతన సచివాలయం, జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు, హైదరాబాద్ చుట్టూ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అమర వీరుల స్తూపం, రైతు వేదికలు, మెడికల్కాలేజీలు… ఇలా అనేక నిర్మాణాలు చేపట్టింది. ఇలా కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో మూలధన వ్యయం కింద రూ.4 లక్షల కోట్ల వరకు వ్యయం చేసి.. అంతకు ఐదారు రెట్ల విలువైన ప్రాజెక్టులు, భవనాల రూపంలో ఆస్తులను సృష్టించింది. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. ఆదాయమూ పెరిగింది.. క్యాపిటల్ ఎక్స్పెండేచర్ రూపంలో రూ.వేలాది కోట్లు ఖర్చు చేసి సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఫ్లైఓవర్లు, విద్యుత్తు సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం, భవనాల నిర్మాణం వంటి అనేక ప్రాజెక్టులు చేపట్టింది. ఫలితంగా వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు.. ఇలా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యం అయ్యింది. ఇది రాష్ట్ర ఆదాయాన్ని మెరుగుపరిచింది. ఇందు zకు సొంత పన్నుల రాబడి పెరగడమే ఉదాహరణ. ప్రజ ల కొనుగోలు శక్తి, రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు పెరిగాయనడానికి దీనిని ప్రతీకగా భావిస్తుంటారు. వ్యవసాయం, ఉద్యోగం, ఉపాధి.. ఇలా ఏదో ఒక రూపంలో ప్రజలకు ఆదాయం పెరిగితేనే కొనుగోళ్లు పెరుగుతాయి. రాష్ట్రంలో అన్ని రకాల సదుపాయాలు ఉంటేనే పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు, జాతీ య, అంతర్జాతీయ కంపెనీలు, వాణిజ్య సంస్థలు తరలివచ్చి, వాటి ద్వారా పన్ను ఆదాయం పెరుగుతుం ది. తెలంగాణ ఏర్పడేనాటికి సొంత పన్నుల ఆదాయం కేవలం రూ.29వేల కోట్లు ఉండే ది. కానీ పదేండ్లలోనే రూ.1.36 లక్షల కోట్లకు పెరిగింది. అంటే నాలు గు రెట్లకుపైగా వృద్ధి నమోదైంది. సొంత పన్నుల రాబడిలో తెలంగాణ వృద్ధి ఇలా (రూ.కోట్లలో) ఏడు రెట్లు పెరుగుదల స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో రాష్ట్ర బడ్జెట్ రూ.లక్ష కోట్లు మాత్రమే ఉండేది. ఆదాయమూ అంతంతే. 2014-15లో రాష్ట్ర సొంత పన్నుల రాబడి రూ.29,288 కోట్లు మాత్రమే. ఈ నేపథ్యంలో మొదటి సంవత్సరం క్యాపిటల్ ఎక్స్పెండేచర్గా రూ.11,583 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆ తర్వాత ఏటేటా మూలధన వ్యయాన్ని పెంచారు. ఆస్తుల కల్పన, తద్వారా ఆదాయం పెంపుపై దృష్టిసారించారు. ఈ ప్రయత్నాలు ఫలించి ఏటేటా రాష్ట్ర రాబడి పెరుగుతూ వచ్చింది. దీంతో దానికి తగ్గట్టే క్యాపిటల్ ఎక్స్పెండేచర్ను పెంచారు. పదేండ్లలోనే మూల ధన వ్యయం దాదాపు ఏడు రెట్లు పెరిగింది. 2023-24 నాటికి క్యాపిటల్ ఎక్స్పెండేచర్గా రూ.78,611 కోట్లు కేటాయించారు. మొత్తంగా పదేండ్లలో రూ.4.04 లక్షల కోట్లను మూలధన వ్యయం కింద ఖర్చు చేసినట్టు ఆర్బీఐ నివేదిక స్పష్టంచేసింది. అత్యధిక మూలధన వ్యయం కేటాయిస్తున్న రాష్ర్టాల్లో 2014-15లో తెలంగాణ 12వ స్థానంలో నిలిచింది. 2023-24 నాటికి ఐదో స్థానానికి పెరిగింది. వృద్ధిరేటులో దేశంలోనే అగ్రస్థానం ఆర్బీఐ గణాంకాల ప్రకారం మూలధన వ్యయం వృద్ధిరేటులో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. 2014-15తో పోల్చితే 2023-24 నాటికి రాష్ట్ర మూలధన వ్యయం 580% పెరిగింది. దేశంలోని మిగతా పెద్ద రాష్ర్టాల్లో ఇదే అత్యధికం. ఈ క్రమంలో బీజేపీ పాలిత రాష్ర్టాలను సైతం తెలంగాణ దాటేయడం విశేషం. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ర్టాలన్నీ తెలంగాణ వెనుకే నిలిచాయి. ఇతర మౌలిక వసతులు.. 30 జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాలను నిర్మించేందుకు రూ.1,650 కోట్లను కేటాయించింది. 20 జిల్లాల్లో పనులు పూర్తి కాగా, 10 జిల్లాల్లో పనులు కొనసాగుతున్నాయి. 218.44 కోట్లతో కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారుల నివాసగృహాలను 25 జిల్లాల్లో చేపట్టింది. రూ.617 కోట్లతో కొత్త సచివాలయం నిర్మించింది. బంజారాహిల్స్లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను రూ.585 కోట్లతో నిర్మించింది. హుస్సేన్సాగర్ ఒడ్డున రూ.146.50 కోట్లతో 125 అడుగుల అంబేదర్ విగ్రహం ఏర్పాటు చేసింది. ఇది తెలంగాణకు కీర్తిని తేవడంతోపాటు పర్యాటక ప్రాంతంగా మారింది. రూ.177.50 కోట్లతో హైదరాబాద్లోని లుంబినీపారులో తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని నిర్మించారు. రూ.4,080 కోట్లతో 8 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టింది.హైదరాబాద్ చుట్టూ మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానలు (టిమ్స్), వరంగల్లో హెల్త్సిటీ పేరుతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి రూ.3,779 కోట్లు కేటాయించింది.నిమ్స్ విస్తరణకు రూ.1,571 కోట్లు కేటాయించింది. ఇంటింటికీ అందిన తాగునీళ్లు కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రుణంలో రూ.37 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేసింది. ఫలితంగా 23,839 గ్రామీణ ఆవాసాల్లోని 57 లక్షల ఇండ్లకు, పట్టణ స్థానిక సంస్థల్లో విలీనమైన 649 గ్రామీణ ఆవాసాలకు, 121 పట్టణ స్థానిక సంస్థలకు తాగునీరు అందించింది. దీని ఫలితంగా ప్రజలకు ప్రత్యక్షంగా శుద్ధి చేసిన నీరు అందుతుండగా.. పరోక్షంగా వ్యాధులు తగ్గి వైద్య భారం తగ్గింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 12వ స్థానం పదేండ్లలోనే 7 స్థానాలు పైకి కేసీఆర్ హయాంలో లక్షల కోట్ల ఆస్తుల సృష్టి 'బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైంది' – ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం ఇది. 'బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడి వ్యయం కింద ప్రభుత్వం రూ.4 లక్షల కోట్ల మేర ఖర్చు చేసింది' – ఆర్బీఐ హ్యాండ్బుక్ వెల్లడించిన వాస్తవం ఇది. కేసీఆర్ పాలనలో పదేండ్లలో రూ.50 లక్షల కోట్ల మేర విలువైన ఆస్తులు సృష్టించాం'బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన లెక్కలివి . కాంగ్రెస్ ఇన్నాళ్లూ చేసింది దుష్ప్రచారమో.. ఆర్బీఐ చెప్పింది అబద్ధమో.. సమాధానం చెప్పాలి. కొన్ని పెద్ద రాష్ర్టాల్లో పదేండ్లలో మూలధన వ్యయం వృద్ధి ఇలా.. ప్రస్తుతం రాష్ట్ర రహదారుల్లో.. నాలుగు లైన్ల రోడ్లు 1,154 కిలోమీటర్లు డబుల్ లైన్లరోడ్లు 12,060 కిలోమీటర్లు సింగిల్ లైన్ రోడ్లు 14,520 కిలోమీటర్లు 2014 నుంచి కొత్తగా వేసినవి.. ఆరు లేన్ల రోడ్లు 39 కిలోమీటర్లు నాలుగు లైన్ల రోడ్లు 321 కిలోమీటర్లు డబుల్ లైన్ రోడ్లు 8,218 కిలోమీటర్లు మరమ్మతులు 8,064 కిలోమీటర్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa