ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫార్ములా ఈ- రేసు కేసులో మరో ట్విస్ట్.. సీన్‌లోకి ఈడీ ఎంట్రీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2024, 06:50 PM

తెలంగాణలో ప్రస్తుతం సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేసు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ రంగంలోకి దిగి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మరో ఇద్దరు అధికారులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ.. నాలుగు సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో.. కేటీఆర్‌కు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారని తెలుస్తోంది. ఇంతలో సీన్‌లోకి ఈడీ కూడా ఎంటరయ్యింది. తాజాగా.. తెలంగాణ ఏసీబీ డీజీ విజయ్ కుమార్‌‌కు.. హైదరాబాద్ ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ లేఖ రాశారు.


ఈ మేరకు కేటీఆర్‌ మీద నమోదైన కేసు వివరాలను అందజేయాలని ఆ లేఖలో రోహిత్ ఆనంద్ పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండీఏ సంస్థ అకౌంట్ నుంచి ఎంత మొత్తం నిధులను బదిలీ చేశారో పూర్తి వివరాలు తెలియజేయాలని కోరారు. ముఖ్యంగా లావాదేవీలు ఏయే తేదీల్లో జరిగాయో పూర్తి వివరాలు పంపాలని లేఖలో రోహిత్ ఆనంద్ ప్రస్తావించారు. అదేవిధంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఫిర్యాదు కాపీని కూడా తమకు పంపాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ కోరటం గమనార్హం. ఇప్పటికే ఏసీబీ కేసులతో రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలోకి.. ఈడీ కూడా ఎంటర్ అవటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


ఇప్పటికే.. ఫార్ములా ఈ కార్‌ రేస్ వ్యవహారంలో అధికార దుర్వినియోగం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందంటూ కేటీఆర్‌ మీద ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో.. ఏ1గా కేటీఆర్‌తో పాటు ఏ2గా ఐఏఎస్‌ అరవింద్ కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. త్వరలోనే విచారణకు నోటీసులు కూడా జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే.. కేటీఆర్ మీద నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయటంతో.. అరెస్ట్ కావటం ఖాయమని.. సుమారు ఏడేళ్లు జైలు శిక్ష తప్పదంటూ ప్రభుత్వ పెద్దలు బహిరంగంగా వ్యాఖ్యానించటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.


అయితే.. ఈ కేసుపై చాలా రోజులుగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో.. మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సీఎస్‌ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాయటంతో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa