తెలంగాణలో కొత్త ఆర్వోఆర్ చట్టం భూ భారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 17న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టగా.. మూడు రోజుల సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం (డిసెంబర్ 20న) బిల్లుకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భూమి కోసం, భుక్తి కోసం ఆనాడు వీరోచిత పోరాటం జరిగిందని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రజలకు భూమి ఓ ఆత్మగౌరవమన్నారు. నిజమైన భూయజమానుల హక్కులను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ రెవెన్యూ శాఖ, ముఖ్యమంత్రి మధ్య ఉండాల్సిన సమాచారం.. ఇతర దేశాలకు వెళ్లిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మన భూములకు సంబంధించిన పూర్తి సమాచారం.. ఇతర దేశాల్లో స్థిరపడిన ప్రముఖుల వద్ద ఉందన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన కంపెనీల ద్వారా డేటాను దేశం దాటించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల్ని మోసం చేసి సమాచారం అంతా క్రిమినల్స్కు అందించారన్నారు. ఈ నేరాలకు ఏం శిక్ష విధించాలో తెలియాలంటే చట్టాలన్నీ చదవాల్సిన పరిస్థితి ఉందన్నారు. డజన్ల కొద్ది కంపెనీలు ధరణిలోకి ఎందుకు వచ్చాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇవన్నీ తాము ఎన్నికల ముందు చెబితే.. తమనే బంగాళాఖాతంలో కలపాలని మాట్లాడారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
అందుకే.. ఇచ్చిన మాట ప్రకారం తాము అధికారంలోకి వచ్చాక ధరణిని బంగాళాఖాతంలో కలిపామని స్పష్టం చేశారు. ధరణిని కేసీఆర్ తయారు చేయలేదని.. 2010లోనే ఒడిశాలో ఈ ధరిణి పోర్టల్ తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ధరణి పేరుతో బీఆర్ఎస్ నేతల అరాచకం, దుర్మార్గం చెప్పలేని స్థాయికి వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి నిర్వహణలో ఎలాంటి మార్పులు చేయాలన్నా ప్రభుత్వ అనుమతి ఉండాలని.. సాఫ్ట్వేర్లో ఏ మార్పు చేయాలన్నా ప్రభుత్వ ఆఫీసులోనే ఉండి పనిచేయాలని.. కానీ నిబంధనలు ఉల్లంఘించి కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ధరణి పోర్టల్ను వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ఆపరేట్ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు తమ భూములకు సంబంధించిన వివరాలు ఇస్తే.. ప్రైవేట్ వ్యక్తులకు సమాచారం అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాదె శ్రీధర్ రాజు ద్వారా బీఆర్ఎస్ హయాంలో సమాచారాన్ని దేశాలు దాటించారని అన్నారు. వాళ్లు ఒక్క క్లిక్ చేస్తే చాలు.. సమాచారం మొత్తం నాశనం అయిపోతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మన దగ్గరున్న సర్వర్లు కూడా క్రాష్ అవుతాయన్నారు. అందుకే విచారణకు ఇవ్వడానికి ఇంతకాలం ఆలోచన చేసినట్లు చెప్పుకొచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో అర్ధరాత్రి కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అసలు అర్ధరాత్రుళ్లు రిజిస్ట్రేషన్లు చేసే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి సొంతూరులో కూడా భూదాన్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కిషన్ రెడ్డి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా భూముల బదలాయింపు జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే వాటిపై కేసులు నమోదు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవన్నీ బయటపడుతాయనే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీని అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa