ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేటీఆర్‌కు భారీ ఊరట.. ACBకి హైకోర్టు కీలక ఆదేశాలు.. అప్పటివరకు నో అరెస్ట్.

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2024, 06:39 PM

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫార్ముల ఈ రేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే.. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయగా.. ఇక అరెస్టే తరువాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే.. కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా.. భారీ ఊరట లభించింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏసీబీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. అంతేకాకుండా.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించిన ధర్మాసనం.. విచారణ కొనసాగించొచ్చని హైకోర్టు తెలిపింది. విచారణకు కేటీఆర్‌ సహకరించాలని ఆదేశాల్లో పేర్కొంది. తనపై పెట్టిన కేసు కొట్టేయాలన్న కేటీఆర్ పిటిషన్‌ను మాత్రం హైకోర్టు తిరస్కరించటం గమనార్హం.


ఇదిలా ఉంటే.. ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయగా.. ఆ కేసును కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. అయితే.. కేటీఆర్ పిటిషన్‌ మీద విచారణ జరిపిన న్యాయస్థానం.. సుమారు 2 గంటల పాటు ఇరువైపులా వాదనలు విన్నది. కేటీఆర్‌ తరఫున న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు.


కేటీఆర్ మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారని.. ఆయా సెక్షన్లు ఈ కేసుకు ఏమాత్రం వర్తించవని సుందరం అన్నారు. గతేడాది సీజన్‌ 9 కార్ రేసింగ్ నిర్వహించారని తెలిపారు. ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్‌ 25నే ఒప్పందం జరిగిందని తెలిపారు. సీజన్‌ 9లో రూ.110 కోట్ల లాభం వచ్చిందని వివరించారు. పాత ఒప్పందానికి కొనసాగింపుగా.. కొత్త ఒప్పందం జరిగిందని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేటీఆర్‌ తరఫు న్యాయవాది సుందరం తెలిపారు. 14 నెలల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కనీసం ప్రాథమిక విచారణ చేయకుండానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే కేసు నమోదు చేశారని అన్నారు.


ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌లో ప్రమోటర్ విరమించుకున్న సందర్భంలో.. ఈవెంట్‌ నిర్వహించకపోతే హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దిబ్బతింటుందని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ధర్మాసనానికి వివరించారు. 2024లో కచ్చితంగా ఈ కార్‌ రేసింగ్‌ హైదరాబాద్‌లో జరిపించాలనే ఉద్దేశంతోనే.. ఈ చెల్లింపులు జరిగాయని తెలిపారు. ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌తో హైదరాబాద్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.700 కోట్ల లాభం వచ్చిందని పేర్కొన్నారు. కానీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎఫ్ఈఓ  మిగతా డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిందని వివరించారు.


ఇదే క్రమంలోనే.. లలితా కుమారి వర్సెస్‌ యూపీ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను కేటీఆర్‌ న్యాయవాది ప్రస్తావించారు. ఫార్ములా ఈ రేస్‌ అగ్రిమెంట్‌ జరిగిన 14 నెలల తర్వాతే కేసు పెట్టారని చెప్పారు. ఒకవేళ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్‌ పరిశీలించాలి.. కానీ ఈ కేసుతో ఏసీబీకి సంబంధమేంటని అడిగారు. ఫార్ములా ఈ రేస్‌ కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్‌పై ఎందుకు కేసు పెట్టారన్నారు. ఈ వ్యవహారంలో.. కేటీఆర్‌ ఎక్కడ లబ్ధి పొందారని అడిగారు.


ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ క్లాజ్‌ ఉన్నప్పుడు క్రిమినల్‌ కేసు పెట్టాల్సిన అవసరం లేదని ధర్మాసనానికి కేటీఆర్ న్యాయవాది వివరించారు. ఈ వ్యవహారంలో కేటీఆర్‌కు ఒక్క రూపాయి కూడా అందలేదని చెప్పారు. అయినప్పటికీ కేటీఆర్‌ను ఏ1గా చేర్చారని చెప్పుకొచ్చారు. ఫక్తు రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని.. స్టే ఇవ్వాలంటూ కేటీఆర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa