ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో కొత్త పథకం.. 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' ఎలా ఇస్తారు..? రైతుల్లో ఎన్నో అనుమానాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 05, 2025, 06:50 PM

తెలంగాణలో మరో కొత్త పథకాన్ని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వగా.. అందుకు సంబంధించి ఇప్పుడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 04న జరిగిన కేబినెట్ భేటీలో ప్రధానంగా మూడు హామీలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగా.. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం ఒకటి కాగా.. కొత్త రేషన్ కార్డుల జారీ మరొకటి. ఈ రెండింటితో పాటు భూమిలేని రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ మూడు పథకాలు జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.


భూమిలేని వ్యవసాయ రైతు కుటుంబాలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గతంలో తాను పాదయాత్ర చేసిన సమయంలో కౌలు రైతుల కష్టాలు తన దృష్టికి వచ్చాయని, అందుకే భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని నామకరణం చేసినట్టుగా రేవంత్ రెడ్డి వెల్లడించారు.


ఇదంతా బాగానే ఉంది కానీ.. అసలు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఏ విధంగా ఇస్తారు? ఏ ప్రాతిపదికన రైతు కూలీలను గుర్తిస్తారు? కేవలం రైతు కూలీలకే ఇస్తారా.. కౌలు రైతులకు కూడా ఇస్తారా..? ఈ మొత్తాన్ని నెలకు ఇంతా అని ఇస్తారా.. ఒకేసారి మొత్తం అకౌంట్‌లో వేస్తారా..? ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపైనే సర్వత్రా చర్చ నడుస్తోంది.


భూములు ఉన్న రైతులు కొందరు వ్యవసాయం చేయలేక కౌలుకిస్తుంటారు. మరి ఆ కౌలు చేసే రైతులకు ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఆర్థిక సాయం ఇస్తే.. మరి అసలు భూములున్న రైతులకు రైతుభరోసా ఇస్తుందా ఇవ్వదా అన్నది ఇప్పుడు ప్రజల్లో నెలకొన్న ప్రధాన డౌటనుమానం. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన.. కౌలు రైతులకు సంతోషాన్ని కలిగిస్తుండగా కౌలుకు భూములిచ్చిన రైతులకు మాత్రం ఆందోళన కలిగిస్తోంది.


 ఒకవేళ భూములు ఉన్న రైతులకు, భూమి లేకుండా వ్యవసాయం చేసే రైతులకు 12 వేల రూపాయలు ఇస్తే, ఈ పథకాలను మరికొంతమంది దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందన్న వాదన కూడా వినిపిస్తోంది. కౌలు రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలంటే ఆ రైతు ఏ పొలంలో వ్యవసాయం చేస్తున్నారు..? దాని తాలూకా కౌలు పత్రాన్ని తీసుకోవాల్సి వస్తుందా.. ఒకవేళ అది సదరు రైతు ఇస్తే ఆ రైతుకు రైతు భరోసా వచ్చే అవకాశం ఉండదు.. మరి అలాంటప్పుడు కౌలు రైతులకు భూమి ఉన్న రైతులు సహకరించే పరిస్థితి ఉంటుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. అసలు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆచరణ సాధ్యమైనదేనా అన్నది ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa