లేడీ సూపర్ స్టార్ నయనతార కొద్ది రోజుల క్రితం హీరో ధనుష్ గురించి సుధీర్ఘ లేఖ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ధనుష్ ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీ నుంచి ఓ క్లిప్ తన డాక్యుమెంటరీ కోసం ఉపయోగించినందుకు ఆ హీరో కాపీరైట్స్ నోటీసులు పంపించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన అనుమతి లేకుండా క్లిప్ ఉపయోగించినందుకు రూ.10 కోట్లు చెల్లించాలని ధనుష్ నోటీసులు పంపించడాన్ని ప్రశ్నిస్తూ నెట్టింట విమర్శలు గుప్పించింది. ధనుష్ ప్రవర్తన గురించి తీవ్రంగా నెగిటివ్ కామెంట్స్ చేయడంతో నయనతారపై ధనుష్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో ఆమె తీరును ఖండించారు. ఈ క్రమంలోనే తాజాగా నయనతార మరోసారి చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. నయనతారకు చంద్రముఖి మూవీ మేకర్స్ నోటీసులు పంపినట్లు ఓ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలపై చంద్రముఖి మూవీ నిర్మాతలు రియాక్ట్ అయ్యారు. నయనతారకు తాము ఎలాంటి నోటీసులు పంపలేదని స్పష్టం చేశారు. తాము రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వస్తోన్న వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు. నయనతార తన డాక్యుమెంటరీ కోసం ముందే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. “నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ తెరకెక్కించే ముందే రౌడీ పిక్చర్స్ సంస్థ మా వద్ద నో అబక్షన్ సర్టిఫికెట్ తీసుకుంది. డాక్యుమెంటరీలో చంద్రముఖి లోని సన్నివేశాలను ఉపయోగించడంపై మేము ఎలాంటి నోటీసులు పంపలేదు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు” చంద్రముఖి నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ పేర్కొంది.మరోవైపు ఈ విషయంపై నయనతార టీం స్పందించింది. చంద్రముఖి నిర్మాతలు తమకు నోటీసులు పంపినట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని.. చంద్రముఖి మూవీ సీన్స్ వాడుకోవడానికి సదరు నిర్మాణ సంస్థకు తమకు ముందుగానే ఎన్ఓసీ ఇచ్చిందని నయన్ టీం పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa