ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట.. లాయర్‌‌కు అనుమతి, కానీ ట్విస్ట్‌ ఏంటంటే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 08, 2025, 07:52 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేసు కేసులో భాగంగా ఏసీబీ విచారణకు తన వెంట లాయర్‌ను అనుమతించాలంటూ కేటీఆర్.. హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై.. విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సీసీటీవీ పర్యవేక్షణలో కేటీఆర్‌ విచారణ జరపాలని న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరుగుతున్న సమయంలో.. లైబ్రరీ రూంలో లాయర్‌ కూర్చునేందుకు హైకోర్టు అనుమతించింది. కేటీఆర్‌ ఓ గదిలో, లాయర్‌ మరో గదిలో ఉండాలని హైకోర్టు సూచించింది. ఆడియో, వీడియో రికార్డింగ్‌కు మాత్రం హైకోర్టు అనుమతించలేదు. ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టుకు రావొచ్చని న్యాయమూర్తి సూచించారు.


తీర్పు వెలువరించే ముందు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏసీబీ విచారణలో కేటీఆర్ వెంట న్యాయవాది కలిసి కూర్చునేందుకు అనుమతించే ప్రసక్తే లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏసీబీ కార్యాలయంలోకి లాయర్‌ను అనుమతిస్తాం కానీ.. కేటీఆర్‌కు దూరంగా ఉండాలని ఆదేశించింది. అయితే.. ఇందుకోసం ముగ్గురు లాయర్ల పేర్లు ఇవ్వాలని కేటీఆర్ తరఫు న్యాయవాదికి సూచించింది.


విచారణ సమయంలో హైకోర్టు ధర్మాసనం పలు కీలక ప్రశ్నలు లేవనెత్తింది ధర్మాసనం. విచారణను న్యాయవాది చూసే అవకాశం ఏసీబీ నియమ నిబంధనల్లో ఉందా..? అని కోర్టు అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. అందుకు వారు లేదని సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా.. "కేటీఆర్ విచారణ ప్రక్రియను లాయర్లు వీక్షించే అవకాశం ఉందా..? విచారణ గది కనిపించేలా ఏసీబీలో సౌకర్యం ఉందా లేదా..? కేటీఆర్ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించే పరిస్థితి ఉండదు కదా.. అలాంటప్పుడు విచారణ గదిలో న్యాయవాది ఉండటం ఎందుకు..? న్యాయవాదిని అనుమతిస్తే వచ్చే ఇబ్బంది ఏంటీ..? ఒక రూంలో కేటీఆర్.. మరో గదిలో న్యాయవాది కూర్చుంటే సమస్య ఏంటీ..?" అని ధర్మాసనం ప్రశ్నించింది. మరోవైపు.. కేటీఆర్ తరపున ముగ్గరు న్యాయవాదుల పేర్లు ఇవ్వాలని.. అందులో ఒకరిని కేటీఆర్ విచారణ కనిపించేలా అనుమతిస్తామని హైకోర్టు తెలిపింది.


విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. విచారణకు సంబంధించిన ఆడియో, వీడియోను రికార్డు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్న విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ కేసులో తాము ఇచ్చిన ఆర్డర్‌ కాపీ చదివారా అని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయవాదిని అనుమతించిన పలు సుప్రీం కోర్టు తీర్పులను కేటీఆర్‌ తరపు న్యాయవాది కూడా ప్రస్తావించగా.. న్యాయవాదిని విచారణ సందర్భంలో అనుమతి ఇవ్వని పలు తీర్పులను ఇటు ఏఏజీ రజనీకాంత్ రెడ్డి కూడా వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa