బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి సాండ్ కమిటి సమావేశం నిర్వహించి నూతన ఇసుక పాలసీ ఆమోదించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంక్రాంతి తరువాత జనవరి 16 నుంచి జిల్లాలో సామాన్య ప్రజలు తమ సొంత అవసరాలకు జిల్లాలోని 6 రీచ్ ల నుంచి ఉచితంగా ఇసుక తీసుకోవచ్చని అన్నారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో వినియోగించుకునేందుకు జిల్లా ప్రజలు సుల్తానాబాద్ లోని నీరుకుల్ల, గట్టెపల్లి, ముత్తారం లోని ముత్తారం, అడవి శ్రీ రాంపూర్, మంథని లోని విలోచవరం,అంతర్గాం లోని గోలివాడ ఇసుక రీచ్ లలో ఎక్కడి నుంచైనా ట్రాక్టర్లలో ఇసుక తీసుకోవచ్చని అన్నారు.ఇసుక రీచ్ ల నుంచి ఉచితంగా తీసుకునే ఇసుక సొంత అవసరాలకు మాత్రమే వాడాలని, ఈ ఇసుకను మన జిల్లా పరిధిలో మాత్రమే వాడాలని, ఎక్కడా ఇసుక డంప్ లు సృష్టించడానికి వీలు లేదని, ఇసుక డంప్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించాలని చూస్తే కఠిన చర్య లు తీసుకుంటామని అన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇసుక తరలించాలని, సాయంత్రం 5 తరువాత ఇసుక తరలిస్తే సంబంధిత వాహనాలను సీజ్ చేసి మొదటి సారి 25 వేల జరిమానా, రెండవ సారి డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేయడం జరుగుతుందని అన్నారు. ఇసుక తరలింపు కోసం వినియోగించే ట్రాక్టర్ ఓవర్ లోడ్ కావడానికి వీలు లేదని, డ్రైవర్ కు తప్పనిసరిగా లైసెన్సు ఉండాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడానికి వీలు లేదని , వాహనానికి తప్పనిసరిగా రేడియం స్టిక్కర్లు అన్ని వైపులా అంటించాలని కలెక్టర్ అన్నారు.జిల్లాలోని 6 ఇసుక రీచ్ లకు సంబంధిత తహసిల్దార్లు ప్రత్యేకంగా సిబ్బంది కేటాయించి, ప్రతి రోజు తరలించే ఇసుక వాహన వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని అన్నారు.
ప్రతి వారం ఇసుక తరలింపు వివరాలను కలెక్టర్ కు సంబంధిత తహసిల్దార్లు నివేదిక అందించాలని అన్నారు. జిల్లాలోని ఇసుక రీచ్ ల నుంచి తీసుకునే ఇసుక ప్రజలకు జిల్లా యంత్రాంగం నిర్ణయించిన ధర మించకుండా విక్రయించాలని అన్నారు.ట్రాక్టర్ ఇసుక పెద్దపల్లి పట్టణ ప్రాంతంలో 1400, సుల్తానాబాద్ లో 1000, జూలపల్లిలో 1700, ఓదెల లో 1150, శ్రీరాంపూర్ లో 1100, పాలకుర్తి లో 2500, అంతర్గాం లో 1000, రామగుండంలో 2600, మంథని లో 1500, ధర్మారంలో 2300, కమాన్ పూర్ 2200, రామగిరి లో 2200 మాత్రమే విక్రయించాలని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా ట్రాక్టర్ ఇసుక నిర్ణీత ధర కంటే అధికాంగా విక్రయిస్తే 08728 223318, 08728 223310 ఫోన్ నెంబర్ల ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఫిర్యాదు నమోదు చేస్తే సంబంధిత ట్రాక్టర్ల సీజ్ చేయడం జరుగుతుందని, మొదటి సారి 25 వేలు, రెండవ సారి 50 వేల జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 6 ఇసుక రీచ్ ల నుంచి పెద్దపెల్లి జిల్లా రిజిస్టర్ ట్రాక్టర్లు మాత్రమే ఇసుక తీసుకొని వెళ్లాలని, లారీలు, టిప్పర్లు వంటి పెద్ద వాహనాలు, ఇతర జిల్లాల ట్రాక్టర్లు వినియోగించేందుకు వీలు లేదని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa