ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు మాత్రమే గుర్తొచ్చేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఐటీ అంటే హైదరాబాద్ అనేలా అనేక సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా.. మరో సంస్థ నగరంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందంతో కీలక ఒప్పందం చేసుకుంది. నగరంలో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది.
రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు క్యాపిటల్ ల్యాండ్ ల్యాండ్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ గ్రూప్ నేతృత్వంలో హైదరాబాద్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మరో విజయాన్ని సాధించిందని పంచుకోవడానికి సంతోషంగా ఉందని అన్నారు. క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ హైదరాబాద్లో కొత్త ఐటీ పార్క్ కోసం రూ. 450 కోట్ల పెట్టుబడిని ప్రకటించిందన్నారు. ఈ ఐటీ పార్కు ద్వారా కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ట్వీట్ చేశారు.
ఇక హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులకు ST Telemedia Global Data Centres India సంస్థ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ముచ్చర్ల- మీర్ఖాన్పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ను స్థాపించేందుకు ఆ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్లో ఏర్పాటు చేసే అత్యాధునిక AI రెడీ డేటా సెంటర్ను ఈ కంపెనీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పనుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్ సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం ఇందులో ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది.
ప్రస్తుతం STT GDC హైదరాబాద్లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్ను నిర్వహిస్తోంది. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ కంపెనీ దేశంలో వచ్చే పదేండ్లలో దాదాపు 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఒక గిగావాట్ సామర్థానికి విస్తరించాలన్న లక్ష్యంతో పెట్టుబడులు పెడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa