బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీద చేయి చేసుకోవటంపై స్పష్టత ఇచ్చారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని 149 ఎకరాల్లో ఉన్న ఏకశిలా నగర్కు చెందిన ప్లాట్ యాజమానులు గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల ఇబ్బందులు పడుతున్నారని.. అందులో భాగంగానే ఓ బాధితుడు తనతో గోడు వెళ్లబోసుకున్నాడని తెలిపారు. ఈ నేపథ్యంలో.. తనకు సంబంధించిన స్థలానికి వెళ్లగా.. అక్కడ రియల్ ఎస్టేట్ సిబ్బంది వైఖరికి తాను అలా స్పందించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
మంగళవారం (జనవరి 21న) ఉదయం ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీద చేయిచేసుకోవటంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటివరుక ఎవరిపై చెయ్యి కూడా ఎత్తలేదని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. కానీ.. ఈరోజు జరుగుతున్న అన్యాయం చూసి న్యాయం కోసం చేయి చేయికోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలో 149 ఎకరాల్లో.. ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉందని.. 1985లో ఆనాడు వివిధ సంస్థలలో పనిచేసే చిన్న ఉద్యోగులు ఈ భూములు కొనుక్కున్నారని ఈటల చెప్పుకొచ్చారు. 2006లో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి మోసం చేసేందుకు చూశారన్నారు. కానీ.. రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ తప్పని కోర్టు డిస్మిస్ చేసిందని ఎంపీ ఈటల పేర్కొన్నారు.
2011లో మరోసారి కాజేసే ప్రయత్నం చేశారని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. కొంతమంది అధికారులతో కలిసి డీపీఓ సహకారంతో.. ధరణిని ఆసరాగా చేసుకుని మళ్లీ భూములు కొట్టేసే ప్రయత్నం చేశారని ఈటల తెలిపారు. ప్లాట్ ఓనర్స్ ఇళ్లు కట్టుకుందామంటే అనుమతులు రావడం లేదు.. రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యంగా ప్లాట్స్ యజమానులను వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే.. ఓ బాధితుడు ఇల్లు కట్టుకుంటుంటే దాన్ని దౌర్జన్యంగా కూల్చివేశారని తనతో గోడు వెల్లబోసుకున్నాడని ఈటల తెలిపారు. అది చూపించేందుకు తీసుకెళ్తే అక్కడికి వెళ్లానన్నారు. తాను వెళ్లిన సమయంలో.. అక్కడ కొంతమంది రౌడీలు మద్యం సేవిస్తూ హంగామా చేశారని.. తనను చూసి చులకనగా మాట్లాడాడని చెప్పుకొచ్చారు. అందుకే ప్రజల పక్షాన వాడిపై చేయి చేసుకున్నానని ఈటల స్పష్టం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయం చేయకపోవడంతో.. ప్రజాప్రతినిధిగా బాధితులకు న్యాయం చేసేందుకు తాను పోరాటం చేస్తానని ఈటల భరోసా ఇచ్చారు. వారిపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తానని కూడా తెలిపారు.
రాచకొండ పోలీస్ కమిషనర్కి సైతం జరిగిన విషయం వివరిస్తానని ఈటల రాజేందర్ తెలిపారు. కోర్టుల్లో న్యాయం దక్కినా కూడా స్థానికంగా వీరికి న్యాయం జరగడం లేదని ఈటల వాపోయారు. వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి.. బాధితులకు న్యాయం చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa