ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జోరుగా కొమురవెల్లి మల్లన్న జాతర.. పోటెత్తిన భక్తజనం.. ఎన్ని రోజులు సాగుతుందంటే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 21, 2025, 07:45 PM

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఒకటి. తెలంగాణ ప్రజలు కొమురెల్లి మల్లన్నగా పిలుచుకునే ఈ పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎంతో మహిమగలిగిన దైవంగా కొలిచే మల్లికార్జున స్వామికి.. ఏటా ఘనంగా జాతర నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున జాతర ప్రారంభమవుతుంది. అందులో భాగంగానే.. ఆదివారం (జనవరి 19న) రోజున బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభించారు. ఈ జాతరకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు.


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భక్తులే కాకుండా.. పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తజనం ఈ జాతరకు వచ్చి.. స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్దఎత్తున తరలివస్తున్న భక్తజనంతో కొమురవెల్లి ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ఇసుకెస్తే రాలనంత జనంతో దేవాలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఆదివారం (జనవరి 19న) ఒక్క రోజే సుమారు 70 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.


సంక్రాంతి సెలువులు ముగిసిపోయినా.. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కుటుంబసమేతంగా విచ్చేస్తున్నారు. సోమవారంతో పాటు ఈరోజు (మంగళవారం) కూడా పెద్దఎత్తున భక్తులు మల్లన్న క్షేత్రానికి చేరుకుంటున్నారు. జనవరి 19 మొదలైన ఈ జాతర.. దాదాపు రెండున్నర నెలల పాటు జరుగుతూనే ఉంటుంది. ఉగాది పండగకు ముందు వచ్చే ఆదివారం రోజు అర్ధరాత్రి తర్వాత నిర్వహించే అగ్నిగుండం కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నట్టు ఆలయ అధికారులు చెప్తున్నారు.


ఈ బ్రహ్మోత్సవాల్లో మొదటి వారాన్ని "పట్నం వారం"గా పిలుస్తారు. శనివారం (జనవరి 18న) సాయంత్రమే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మల్లికార్జునస్వామిని ధూళి దర్శనం చేసుకున్నారు. ఆదివారం (జనవరి 19) రోజున మల్లన్నకు, గుట్టపై ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పించారు. సోమవారం (జనవరి 20న) "పట్నం-అగ్నిగుండం" కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను హైదరాబాద్‌‌కు చెందిన భక్తులు సొంత ఖర్చులతో నిర్వహించారు.


అయితే.. రెండున్నర నెలలు కొనసాగనున్న కొమురవెల్లి జాతరలో ప్రతి ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించటం విశేషం. దీంతో ఆదివారం రోజున భక్తుల రద్దీ.. సాధారణ రోజుల కంటే రెట్టింపుగా ఉంటుంది. జాతరకు విచ్చేసిన భక్తులు.. మల్లన్నకు, అమ్మవారికి బోనాల మొక్కులు సమర్పించుకుంటుంటారు. పట్నం వేసి కళ్యాణాలు జరిపించి.. మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి మల్లన్న జాతరకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు.


వేలాదిగా తరలి వస్తున్న భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజగోపురం పక్కన భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేశారు. ఎండ తగలకుండా.. చలువ పందిళ్లు వేయించారు. కొత్తగా నిర్మించిన ప్రసాదాల విక్రయ కేంద్రం, ఆర్జిత సేవల రసీదులు అందజేత సెంటర్ల దగ్గర పక్కా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa