రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతీ వ్యక్తికి రేషన్ కార్డ్ ఇస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామంలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లితో కలిసి పాల్గొన్నారు. ఇక్కడ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పుకు కాంగ్రెస్ శ్రీకారం చుడుతోందన్నారు. అర్హత ఉన్న వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా, అదనపు చేరికలు చేసుకునేలా వేసులు బాటు కల్పించామని చెప్పారు. ఏ విధంగా మీరు దరఖాస్తు చేసుకున్న వాటిని తప్పక పరిశీలిస్తామనీ, అర్హుల జాబితాలో పేరు లేకుంటే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. రేషన్ కార్డుల విషయంలో గొప్పగా ఆలోచించి, అందరికీ రేషన్ అందేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేవలం 40వేల మందికి మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చిందనీ, మా ప్రభుత్వం 40లక్షల మందికి ఇవ్వబోతున్నదని చెప్పారు. ప్రస్తుతమిస్తున్న బియ్యం తినడానికి వీలు లేకుండా అమ్మడానికి మాత్రమే పనికొచ్చేవనీ, ఒక్కో వ్యక్తికి 6కిలోల నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వబోతున్నామని ప్రకటించారు.
ఇండ్ల విషయంలోనూ ప్రజలు పదేళ్లపాటు మోసపోయారనీ, ఇండ్లు అవసరమున్న ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. అర్హులకు రూ. 5లక్షలు, ఎస్సీ ఎస్టీలకు రూ. 6లక్షలు ఇస్తామని తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు 12వేలు రైతు భరోసా ఇస్తామని పేర్కొంటూ, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయభరోసా పథకంలో భాగంగా 12వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కలెక్టర్ పమేలా సత్పతి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎంపీడీవో విజయ్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణా రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ఎల్ గౌడ్, సీనియర్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస రావు, గంకిడి లక్ష్మారెడ్డి, కుంట రాజేందర్ రెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, గవ్వ రాజేందర్ రెడ్డి, మామిడి నరేందర్ రెడ్డి, మాచర్ల అంజయ్య గౌడ్, ఎలుక రాజు, రాములు యాదవ్ తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa