ఇటీవల కాలంలో తెలంగాణలోని ప్రభుత్వ స్కూల్స్, హాస్టల్స్, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలో తెలంగాణ హైకోర్టు సైతం ప్రభుత్వానికి మెుట్టికాయలు వేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకంపై విద్యా కమిషన్ కీలక సూచనలు చేసింది. మధ్యాహ్న భోజన ధరలను 50 శాతం పెంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దాంతో పిల్లలకు నాణ్యమైన భోజనం అందుతుందని పేర్కొంది.
తెలంగాణలోని గవర్నమెంట్ స్కూల్స్, గురుకులాల్లో ఆహార నాణ్యత, భద్రత, మౌలిక వసతులు, శానిటరీకి సంబంధించిన లోటుపాట్లను పరిశీలించిన మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళీ నేతృత్వంలోని తెలంగాణ విద్యా కమిషన్.. తాజగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఇటీవల కాలంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూసిన తరుణంలో ఛైర్మన్ మురళి, కమిషన్ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా పలు స్కూల్స్, గురుకులాలు, కేజీబీవీలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. వివిధ వర్గాలతో చర్చించి పలు సూచనలతో నివేదికను రూపొందించారు. ప్రస్తుతం వంట ఏజెన్సీ మహిళలకు చెల్లిస్తున్న ధరలు ధరలు గిట్టుబాటు కావడం లేదని గుర్తించారు. దాని కారణంగానే విద్యార్థులకు నాసిరకం భోజనాన్ని పెడుతున్నారని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఏజెన్సీలకు నెలకు ఒకసారి కాకుండా వారం వారం ఆన్లైన్లో బిల్లులు చెల్లించాలని ప్రతిపాదించింది.
గురుకుల స్కూళ్లల్లో సరకులు, కాస్మెటిక్స్, స్టూడెంట్ కిట్లు తదితరాల సేకరణకు టీజీఈడబ్ల్యూఐడీసీను ఏజెన్సీగా చేయాలని సూచించింది. తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని చెప్పింది. అన్ని గురుకులాలు, పాఠశాలల్లో పథకం అమలుకు ప్రామాణిక నిబంధనలు ఉండాలని నివేదికలో పేర్కొంది. కామన్ మెనూ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వంట సహా తాగేందుకు బోర్ నీళ్లకు బదులు మిషన్ భగీరథ నల్లా నీళ్లు వాడాలని.. భోజనాన్ని కట్టెల పొయ్యిలపై కాకుండా గ్యాస్పై వండించాలని సూచించింది. ఈ నివేదికపై కేబినెట్లో చర్చించి.. నాణ్యమైన భోజనం కోసం ధరలను పెంచనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa