డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. బ్యాంకు మేనేజర్ సహా 52 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి భారీగా చెక్బుక్లు, సెల్ఫోన్లు, రబ్బర్ స్టాంపులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులు మూడు రకాల సైబర్ క్రైమ్ మోసాలకు పాల్పడ్డారని వివరించారు. నిందితుల్లో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు సైతం ఉన్నారని తెలిపారు. ఫేస్బుక్ బ్రౌజింగ్, వాట్సప్ గ్రూప్స్ ద్వారా అమాయక ప్రజలను నిందితులు ఆకర్షిస్తున్నారని వివరించారు. ‘‘బాధితుడిని లక్ష్యంగా చేసుకొని ట్రేడింగ్ పేరుతో రూ.93 లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. మ్యూల్ ఖాతాను తెరిపించి.. బ్యాంకు అధికారుల సహకారంతో మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో గుర్తించాం. ప్రజలెవరూ గుర్తుతెలియని యాప్స్, వాట్సప్ గ్రూప్స్లో జాయిన్ కావొద్దు. ఆన్లైన్లో పెట్టుబడులపై జాగ్రత్తగా ఉండాలి. సైబర్ నేరాల విషయంలో ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. చదువుకున్న వ్యక్తులు సైతం సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నారు. గతేడాదిలో రూ.3,500 కోట్లు సైబర్ క్రైమ్ ద్వారా కాజేశారు. ఇందులో కేవలం 13 శాతం మాత్రమే రికవరీ చేశాం. ఈ కేసుల్లో నగదును రికవరీ చాలా కష్టంగా మారింది. నిందితులు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వ్యక్తులు కావడంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది’’ అని సీవీ ఆనంద్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa