ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేవలం రూ.380కే,,,ఒక్కరోజు హైదరాబాద్ సిటీ టూర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 07:28 PM

కాస్మోపాలిటన్ సిటీగా హైదరాబాద్ పేరు తెచ్చుకుంది. అయితే హైదరాబాద్ నగరంలో పురాతన కట్టాడాల దగ్గరి నుంచి అత్యాధునిక ఆకాశ హర్య్మాల వరకు అన్నీ ఉన్నాయి. పాత, కొత్త కలగలిపిన హైదరాబాద్ నగరాన్ని చూసేందుకు నిత్యం రాష్ట్రాలు, దేశ, విదేశాలకు చెందిన టూరిస్ట్‌లు వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చి.. హైదరాబాద్‌ నగర అందాలను ఆస్వాదిస్తూ ఉంటారు. ఇక హైదరాబాద్ నగరం అనగానే చార్మినార్, గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్, మక్కా మసీదు వంటివి గుర్తుకొస్తూ ఉంటాయి. వీటిని ఒక్కసారైనా చూడాలని చాలా మంది కోరుకుంటారు.


కానీ నగరంలో ట్రాఫిక్ సమస్యలు, ఒక్కరోజులో తిరిగి చూడలేకపోవడం, అవన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే బోలెడంత ఖర్చు అని అంతా భయపడిపోతూ ఉంటారు. అయితే అలాంటి వారికే తక్కువ ధరలోనే హైదరాబాద్ నగర పర్యటన కల్పించేలా తెలంగాణ పర్యాటక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ టూరిజం హైదరాబాద్ సిటీ హెరిటేజ్ కమ్ మ్యూజియం టూర్ పేరుతో ఒక కొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నగరంలోని పలు ఫేమస్ స్పాట్‌లను ఒకేరోజులో తిప్పి చూపించనుంది. ఈ టూర్‌ ప్రతీ రోజు అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.


హైదరాబాద్ నగరంలోని బిర్లా మందిర్, హుస్సేన్ సాగర్, చౌమహాల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్ సహా నగరంలోని ఐకానిక్ ప్రాంతాలను ఒకేరోజులో తిప్పి చూపించేందుకు తెలంగాణ టూరిజం శాఖ ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏసీ, నాన్ ఏసీ బస్సుల పర్యాటకులను నగరం మొత్తం తిప్పనుంది. రోజూ ఉదయం 7:30 గంటలకు బేగంపేట యాత్రి నివాస్ నుంచి ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 7:45 గంటలకు పర్యాటక భవన్ దగ్గర బస్సు ఎక్కాలి. ఆ తర్వాత 8:15 గంటలకు బషీర్‌బాగ్ సీఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా ఒక బోర్డింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఇక బషీర్ బాబాగ్ నుంచి ఈ టూర్ ప్రారంభం అయిన తర్వాత ముందుగా బిర్లా మందిర్‌ ఆలయాన్ని సందర్శించుకుంటారు.


అక్కడి నుంచి చౌమహాల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కా మసీద్‌ వద్దకు తీసుకెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి లాల్ బజార్‌కు తీసుకెళ్లి షాపింగ్ చేసుకునేందుకు కొంత టైమ్ సమయం ఇస్తారు. అనంతరం సాలార్‌జంగ్ మ్యూజియంకు తీసుకెళ్లి చూసిన తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. భోజనం తర్వాత మధ్యాహ్నం నిజాం మ్యూజియం సందర్శన ఉంటుంది. ఆ తర్వాత గోల్కొండ కోటను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తారు. అక్కడి నుంచి కుతుబ్ షాహీ సమాధుల వద్దకు తీసుకువెళ్తారు. అనంతరం ఖైరతాబాద్ ఐమ్యాక్స్ మీదుగా లుంబినీ పార్క్ వద్దకు చేరుకుంటుంది. ఈ ట్రిప్ రాత్రి 7:30 గంటలకు పూర్తి అవుతుంది.


ఈ ట్రిప్ రోజూ ఉంటుంది. అయితే శుక్రవారం రోజున వెళ్తే ఇందులో కొన్ని ప్రాంతాలు చూసే అవకాశం ఉండదు. ఎందుకంటే శుక్రవారం రోజున చౌమహాల్లా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం మూసి వేసి ఉంటాయి. అయితే ఆ రోజు ట్రిప్‌కు వెళ్లిన వారిని ఈ మ్యూజియంలకు బదులు నెహ్రూ జూలాజికల్ పార్కును సందర్శించే అవకాశం కల్పిస్తారు.


హైదరాబాద్ సిటీ వన్ డే ట్రిప్‌లో భాగంగా ఏసీ, నాన్ ఏసీ బస్సులను తెలంగాణ టూరిజం శాఖ అందుబాటులో ఉంచింది. ఇందులో పెద్ద వారికి, చిన్న పిల్లలకు వేర్వేరు ధరలు ఉంటాయి. ఏసీ బస్సులో పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.400 టికెట్‌గా నిర్ణయించారు. అదే నాన్ ఏసీ బస్సు అయితే పెద్దలకు రూ.380. చిన్న పిల్లలకు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో కేవలం ట్రావెలింగ్ వరకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. భోజనం, ఆయా ప్రాంతాల్లో ఎంట్రీ టికెట్లు ఉంటే అవి పర్యాటకులే ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాల కోసం తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూడొచ్చు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com