ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్థానిక సంస్థల ఎన్నికల్లో 'నోటా'

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 07:08 PM

తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాజకీయ పార్టీల ముందు ఎన్నికల కమిషన్ కొన్ని ప్రతిపాదనలు పెట్టగా.. ఈ అంశంపై పార్టీల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ పద్దతిని అధికార కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం స్వాగతించింది. బీజేపీ మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆ అధికారం లేదని.. రాష్ర్ట ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇక.. సీపీఎం కూడా నోటా ఉండాలని చెప్పింది కానీ.. అభ్యర్థిగా మాత్రం గుర్తించొద్దని స్పష్టం చేసింది.


ఎన్నికల ఫలితాలను ప్రకటించేటప్పుడు నోటాను ఒక "కల్పిత ఎన్నికల అభ్యర్థి"గా పరిగణిస్తారు. ఈ క్రమంలో పోటీ చేస్తున్న అభ్యర్థి.. నోటా (కల్పిత ఎన్నికల అభ్యర్థి) తో అత్యధిక సంఖ్యలో సమాన ఓట్లను పొందినట్లయితే.. పోటీ చేస్తున్న అభ్యర్థినే ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఒకవేళ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ వ్యక్తిగతంగా నోటా (కల్పిత ఎన్నికల అభ్యర్థి) కంటే తక్కువ ఓట్లు పొందితే మాత్రం.. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ ఎన్నికైనట్టు ప్రకటించరు. అలాంటి సందర్భంలో.. ఆ స్థానానికి తిరిగి ఎన్నిక నిర్వహిస్తారు. అందులోనూ.. నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తిరిగి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు. ఆ ఎన్నికల్లోనూ.. నోటాకు మళ్లీ అత్యధిక ఓట్లు వస్తే.. ఆ తర్వాత మరోసారి ఎన్నికలు నిర్వహించబడవు. రెండోసారి నిర్వహించిన ఎన్నికల్లో నోటాను మినహాయించి.. పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వారినే ఎన్నికైనట్టుగా ప్రకటిస్తారు.


అయితే.. ఎన్నికల సంఘం పెట్టిన ఈ ప్రతిపాదనలుపై రాజకీయ పార్టీలు భిన్న అభిప్రాయాలను వెలిబుచ్చాయి. నోటాను కల్పిత అభ్యర్థిగా పరిగణించడాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఒకవేళ నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చి ఎన్నికలు మళ్లీ నిర్వహించాల్సి వస్తే.. అటు ప్రభుత్వానికి, ఇటు అభ్యర్థులకు ఖర్చు పెరిగిపోతుందని.. హస్తం పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. మొత్తానికి నోటాకు హస్తం పార్టీ 'నో' చెప్పింది.


ఇక.. నోటాను కల్పిత అభ్యర్థిగా పరిగణించడాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం పూర్తిగా స్వాగతించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవానికి బెదిరింపులు, బలప్రదర్శన చేసే అవకాశం ఉందని గులాబీ పార్టీ పేర్కొంది. ఈ క్రమంలో.. నోటా ఉండాలని అభిప్రాయపడుతూ.. ఎన్నికల సంఘం ప్రతిపాదనలకు కారు పార్టీ 'ఎస్' చెప్పింది.


ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టులో కేసు ఉందని గుర్తుచేసిన బీజేపీ.. తమ అభిప్రాయం ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. అయినప్పటికీ.. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని.. పంచాయతీ ఎన్నికలు ఎలా నిర్వహించాలనే నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలని కమలం పార్టీ స్పష్టం చేసింది.


మరోవైపు.. నోటాతో ఎన్నిక ఉండాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిందని గుర్తు చేసిన సీపీఎం.. నోట ఉండాలని అయితే అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మాత్రం మళ్లీ ఎన్నికలు నిర్వహించటం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. కాగా.. ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని రెండు రోజుల్లో చెప్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ చెప్పగా.. బరిలో ఒక్క అభ్యర్థి ఉన్నా సరే.. నోటా ఉండాలని జనసేన పార్టీ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.


ఇక.. రాష్ట్రంలో సర్పంచ్ పదవుల వేలం పద్ధతిని అరికట్టేందుకు ఈ కల్పిత అభ్యర్థి నిర్ణయం అని రాష్ర్ట ఎన్నికల సంఘం వివరిస్తోంది. ఈ కల్పిత అభ్యర్థి విధానాన్ని ఇప్పటికే మహారాష్ర్ట, హర్యానా రాష్ట్రాలు అవలంభిస్తున్నాయని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీను సూచించింది. మరి.. చివరికి ఈ నోటా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa