ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాళ్లందరికీ ఉచితంగా భోజనం.. రేపటి నుంచే అమల్లోకి..ఖమ్మం కలెక్టర్ గొప్ప నిర్ణయం.

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 05:59 PM

ఒక కలెక్టరేట్‌‌కు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో కలెక్టరేట్‌కు వస్తారు. స్థానిక అధికారుల వల్ల తమ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో కలెక్టరేట్‌కు వెళ్తేనే తమ కష్టాల తీరే మార్గం దొరుకుతుందన్న నమ్మకంతో వస్తుంటారు. అయితే.. కలెక్టరేట్‌కు వెళ్లినవెంటనే.. పనులైపోతాయా అంటే చెప్పలేం. కొన్ని సమస్యలకు ఒక్కరోజులోనే పరిష్కారం దొరకొచ్చు.. మరికొన్ని సమస్యలకు రెండు మూడు రోజులు ఎదురుచూడాల్సి రావొచ్చు. దీంతో.. దూరప్రాంతాలు, మారుమూల పల్లెల నుంచి వచ్చే పేదలు తిండీ తిప్పలు లేకుండా కలెక్టరేట్ దగ్గరే పడిగాపులు పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందులోనూ దివ్యాంగుల పరిస్థితి మరీ దారుణం. ఇలాంటి ఇబ్బందులను గుర్తించిన ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.


పాలనలో ప్రత్యేక శైలిని అవలంభిస్తోన్న ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.. ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో.. కలెక్టరేట్‌కు వచ్చే దివ్యాంగుల ఇబ్బందులను తెలుసుకుని.. ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి­తో పాటు వివిధ పనుల కోసం జిల్లా నలు­మూ­లల నుంచి కలెక్టరేట్‌కు వచ్చే దివ్యాంగులు ఆకలితో వెళ్లొద్దనే భావ­నతో.. వారందరికీ ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. కలెక్టరేట్‌ క్యాంటీన్‌లో ఉచితంగా మధ్యా­హ్న భోజన సౌకర్యం కల్పించాలన్న నిర్ణం తీసుకున్నారు కలెక్టర్. ఈ పథకం ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.


అయితే.. ఉచిత భోజనం అంటే అన్నం, ఒక కూర కాకుండా.. పూర్తి మెనూతో దివ్యాంగులు కడుపు నిండా భోజనం చేసేలా ఈ పథకాన్ని అమలయ్యేలా కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అన్నం, ఆకుకూర పప్పు, రోటిపచ్చడి, రెండు కూరలు, సాంబార్‌ లేదా రసం, పెరుగుతో దివ్యాంగులకు భోజనం పెట్టనున్నారు. అయితే.. ఒక్కో భోజనానికి రూ. 80 చొప్పున క్యాంటీన్‌ నిర్వాహకులకు నెలకోమారు చెల్లించనున్నారు.


ఈ ఉచిత భోజనం కోసం కలెక్టరేట్‌లోని అన్ని కార్యాలయా­లకు కూపన్లు పంపిణీ చేయనున్నారు. ఆయా శాఖలకు 40 శాతం వైకల్యంతో ఉన్న దివ్యాంగులు ఎవ్వరొచ్చినా.. కూపన్లు అందజేయనున్నారు. జారీ చేసిన కూపన్ల వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేయనున్నారు. ది­వ్యాంగులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నామనే విషయాన్ని కలెక్టరేట్‌లోని ప్రవేశ మార్గాల్లో బోర్డులు ఏర్పాటు చేయించనున్నారు.


దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్‌ నంబర్‌ ఆధారంగా ఆయా శాఖల కార్యాలయాల్లో కూపన్‌ అందించనున్నారు. ఈ కూపన్‌తో కలెక్టరేట్‌ క్యాంటీన్‌లో ఉచితంగా భోజనం చేయొచ్చు. ఇందుకోసం క్యాంటీన్‌ బాధ్యులకు రూ.80 చొప్పున చెల్లించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. దివ్యాంగుల నుంచి వచ్చిన విజ్ఞప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముజిమ్మల్ ఖాన్ తెలిపారు. ఈ ఉచిత భోజన కార్యక్రమానాన్ని మార్చి 05 నుంచే ప్రారంభించనున్నట్టు కలెక్టర్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa