తెలంగాణ అసెంబ్లీ సమావాశాలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కీలక బిల్లులను సభలో ప్రవేశ పెట్టగా.. ఆయా బిల్లులకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు కులగణన చేశామన్నారు. ఫిబ్రవరి 4వ తేదీన కేబినెట్లో తీర్మానం చేశామని గుర్తుచేసిన రేవంత్ రెడ్డి.. మూడు కోట్ల 58 లక్షల మంది సర్వేలో పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.. 75 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారని చెప్పుకొచ్చారు.
విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కోరుతూ అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. బిల్లు ఆమోదానికి సహకరించిన సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. దీని ద్వారా అందరం కలిసి కట్టుగా ఉన్నామని సమాజానికి సంకేతం ఇచ్చామన్నారు.
అలాగే.. గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదన ఉపసంహరించుకున్నామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లీగల్గా ఇబ్బంది అవుతుంది కాబట్టి గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తాజా నివేదిక పంపుతున్నామని వెల్లడించారు. రిజర్వేషన్ పెంచాలని.. బలహీన వర్గాలకు అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అందుకే ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే నిర్వహిస్తున్నామని తెలిపారు. చట్టబద్ధత కోసం సభలో బిల్లులు ప్రవేశ పెట్టామన్నారు.
ఏ వివాదాలకు పోకుండా.. బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి తెలిపారు. సభా నాయకుడిగా రిజర్వేషన్ సాధనకు తాను నాయకత్వం వహిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. సభకు రావాలని కేసీఆర్కి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోదామన్నారు. చట్టాలు మనకు అనుకూలంగా రాసుకున్నవేనని.. 42 శాతం రిజర్వేషన్లు అమలు తీసుకొద్దామన్నారు. ప్రధాని మోదీ దగ్గరికి పోదామని.. వీలైనంత తొందరగా ప్రధానిని అపాయింట్మెంట్ అడుగుతామని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ద్వారా ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించండని రేవంత్ రెడ్డి కోరారు.
రాహుల్ గాంధీని కూడా అపాయింట్మెంట్ అడుగుతామని.. ఈ విషయాన్ని పీసీసీ చూసుకుంటుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల గురించి పార్లమెంట్లో ప్రస్తావించాలని కోరాతామన్నారు. జనాభా ఎంతో తేల్చకుండా రిజర్వేషన్ ఇవ్వలేమని సుప్రీం కోర్టు అభిప్రాయపడిందని.. అందుకే తెలంగాణలో సర్వే చేశామని తెలిపారు. లెక్కలు నూటికి నూరు శాతం సరైనవేనన్నారు. బలహీన వర్గాలు 56.3 శాతం జనాభా ఉన్నారన్నారు. ఈరోజు తీర్మానం కాదు చట్టమే చేశామని చెప్పుకొచ్చారు. కామారెడ్డి తీర్మానానికి తాము కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. బీసీలు పాలితులు కాదు పాలకులు అవ్వాలి అని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అందుకోసం తాము కృషి చేస్తున్నామన్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa