ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ప్రజలకు ఉగాది కానుక.. సన్నబియ్యం పంపిణీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 21, 2025, 05:49 PM

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉగాది సందర్భంగా.. పేదల ఇండ్లల్లో పండుగ వాతావరణం నింపే నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే.. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఉగాది పండుగ సందర్భంగా.. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.


ఉగాది పండుగ రోజు నుంచే.. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పండుగ రోజున హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉగాది పండుగ రోజున పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా మటంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మటంపల్లి ఆలయంలో నిర్వహించే పంచాంగ శ్రావణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. అనంతరం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.


కాగా.. రాష్ట్రంలోని అన్ని రేషన్‌‌ షాపుల్లో ఉగాది రోజు నుంచే సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. రేషన్‌‌ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీని మటంపల్లిలోనే సీఎం రేవంత్‌‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం స్థలాన్ని కూడా ఎంపిక చేయనున్నామని.. అన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.


అయితే.. రాష్ట్రంలో ఆహార భద్రత కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికీ ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా.. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికీ.. ఒకొక్కరికీ 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నారు. అయితే.. ప్రస్తుతం ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున దొడ్డు బియ్యం ఇస్తుండగా.. అవి తినడానికి అనువుగా ఉండడం లేదు. ఈ బియ్యం తీసుకుంటున్న వాళ్లలో 85 శాతం మంది.. వాటిని బయట మార్కెట్‌లో కిలోకు రూ.10 చొప్పున అమ్మేస్తున్నారు. కాగా.. ఆ బియ్యాన్నే.. మరింతగా పాలిష్‌ చేసి.. సన్న బియ్యంగా మార్చేసి ఎక్కువ రేటుకు బహిరంగ మార్కెట్‌లో అమ్మేస్తుండటం గమనార్హం.


ఈ పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్.. దొడ్డు బియ్యానికి బదులుగా, అందరూ తినేలా సన్నబియ్యాన్నే పంపిణీ చేయాలని నిర్ణయించింది. గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎట్టకేలకు ఉగాది రోజు ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa