నేడు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై వాడీ వేడి చర్చ జరిగింది. సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. సభ మొదలవగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అందులో పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే విజయరమణారావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు.. మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య అసెంబ్లీలో జరిగిన చర్చ మరింత ఉద్రిక్తతను సృష్టించింది. కాళేశ్వరం ప్రాజెక్టు, రేషన్ కార్డుల వ్యవహారంపై వాగ్వాదం జరిగింది. ఈ చర్చలో.. విజయరమణారావు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు మూడు సంవత్సరాలలోనే కూలిపోయిందని.. వారి ప్రభుత్వంలో ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయలేదని ఆరోపించారు. ఈ విమర్శలకు హరీశ్ రావు స్పందించి మాట్లాడారు.
మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కుంగినంత మాత్రానా ప్రాజెక్ట్ అంతా కూలినట్లు కాదని.. మా మీద కోపంతోనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పడం సరికాదన్నారు. తాను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే పాలమూరు జిల్లాలోనే ప్రాజెక్టుల వద్దకు వెళ్లానని.. అక్కడే నిద్ర చేసి ప్రాజెక్టులను పూర్తి చేశాం అని అన్నారు. అలాగే.. రేషన్ కార్డుల పంపిణీ విషయంలో కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో 6,47,479 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని.. 20,69,033 మంది కొత్త సభ్యులను చేర్చామని వివరించారు. మీరు చెప్పినట్టు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించడం సరికాదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ, ఇతర పథకాలను సమర్థవంతంగా అమలు చేసిందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ చర్చలో పాల్గొని.. మాట్లాడారు. ఒక పిల్లర్ కూలితే భవనం నిలబడుతుందా.. అని హరీశ్ రావును ప్రశ్నించారు. మేడిగడ్డలో ఒక్క ప్రాజెక్టు మాత్రమే కూలిపోయిందని బీఆర్ఎస్ వాళ్లు చెప్పడం కరెక్ట్ కాదన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం చేస్తారనేది సంబంధిత మంత్రి చెప్తారన్నారు. మేడిగడ్డ కూలిందని బీఆర్ఎస్ వాళ్లే ఒప్పుకున్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa