తెలంగాణకు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియమితులయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావును సీఎస్గా నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావు వ్యవహరిస్తున్నారు. కాగా, ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి పదవీ కాలం ఈనెలాఖరు నాటికి పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్గా రామకృష్ణారావును నియమించారు.
1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రామకృష్ణారావు.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత నుంచి ఆర్థిక శాఖలో కీలక భాద్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన ఆగస్టులో రిటైర్ కానున్నారు. ప్రస్తుత ఐఏఎస్లలో సీనియర్గా ఉన్న రామకృష్ణారావు.. ఆర్థిక పరిపాలనలో తన అనుభవంతో రాష్ట్రానికి సేవలందించారారు. అందుకే సీఎస్ పదవికి ఆయన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన నల్లగొండ జాయింట్ కలెక్టర్గా, గుంటూరు కలెక్టర్గా సేవలందించారు.
ప్రస్తుతం సీఎస్గా ఉన్న శాంతి కుమారి 1989 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో 2023 జనవరి 11న ఆమె తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. రిటైర్మెంట్ అనంతరం శాంతి కుమారిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆమె నియామకం ఇప్పటికే ఖరారైనట్లు తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలిసింది.
భారీగా ఐఏఎస్ల బదిలీలు.. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు భారీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. స్మితా సబర్వాల్ను ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా, శశాంక్ గోయెల్ను గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్గా నియమించారు. ఆర్వీ కర్ణన్ జీహెచ్ఎంసీ కమిషనర్గా, ఎస్. వెంకటాద్రి యాదగిరిగుట్ట ఈవోగా నియమితులయ్యారు. దాన కిషోర్ కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, శశాంక ఫ్యూచర్ సిటీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. జెన్కో సీఎండీగా హరీష్, హెల్త్ డైరెక్టర్గా సంగీత సత్యనారాయణ, పరిశ్రమలు, పెట్టుబడుల సీఈవోగా జయేశ్ రంజన్, హెచ్ఎండీఏ సెక్రటరీగా ఇలంబర్తిలు నియమితులయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa