బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ చేసిన విమర్శలను రాజా సింగ్ తప్పుబట్టారు. కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని ఆయన కొట్టిపారేశారు.గతంలో ప్రధాని నరేంద్ర మోదీని దేవుడంటూ ఆకాశానికెత్తిన కేసీఆర్, ఇప్పుడు నిధుల విషయంలో విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రాజా సింగ్ అన్నారు. "అప్పుడు మోదీ దేవుడు మరి నిధులు ఎందుకు అడగలేదు భయపడ్డారా అంటూ ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో తాను నిధుల గురించి ప్రశ్నించినప్పుడు కూడా కేసీఆర్ తప్పుడు సమాధానాలు ఇచ్చారని రాజా సింగ్ గుర్తుచేశారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పది లక్షల కోట్ల రూపాయల నిధులు అందించిందని రాజా సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అందించిన చేయూతే కారణమని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, 'అప్పుల తెలంగాణ'గా, 'మత్తు తెలంగాణ'గా మార్చారని తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్రంలో యువత పెద్ద ఎత్తున మద్యానికి బానిసలు కావడానికి కేసీఆర్ ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన దుయ్యబట్టారు.ప్రజలు కూడా కేసీఆర్ పాలనను చూశారని, డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే తెలంగాణ నిజమైన అభివృద్ధి సాధిస్తుందని విశ్వసిస్తున్నారని రాజా సింగ్ అభిప్రాయపడ్డారు. అయితే, గత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి తమ పార్టీలోని కొందరు నేతల వైఖరే కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించారు. త్వరలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారని, ఆయన నాయకత్వంలో ప్రజల్లోకి బలంగా వెళతామని ధీమా వ్యక్తం చేశారు.ఇకపై బీఆర్ఎస్ అధికారంలోకి రావడం అనేది కేసీఆర్ మరిచిపోవాలని రాజా సింగ్ అన్నారు. "మీ ప్రభుత్వం మళ్లీ వస్తుందనే భ్రమ వీడండి. మీరు ఫార్మ్ హౌస్కు వెళ్లి విశ్రాంతి తీసుకోండి" అంటూ కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa