ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 07:16 PM

పటాన్చెరు  : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి, చిట్కుల్, ఇస్నాపూర్  గ్రామాల పరిధిలో తాగునీటి సరఫరా అంశంలో నెలకొన్న ఇబ్బందులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి.. ప్రజలకు మంచినీటిని అందించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ ఉన్నత అధికారులు, మున్సిపల్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.  జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ముత్తంగి, ఇస్నాపూర్ గ్రామాల పరిధిలో చేపడుతున్న పనుల మూలంగా తాగునీటి పైప్లైన్లు పగిలిపోవడం మూలంగా ప్రజలకు మంచినీటి సరఫరా అంశంలో ఇబ్బందులు తలెత్తయని అధికారులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు.వేసవి కాలం కావడంతో ప్రజలు మంచినీటి అంశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సరఫరాను ప్రారంభించాలని ఆదేశించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో నూతన మంచినీటి ట్యాంకుల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మిషన్ భగీరథ స్థానిక అధికారులు ప్రతిరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని కోరారు. రామేశ్వరం బండ గ్రామ పరిధిలోని వీకర్ సెక్షన్, ఇంద్రపురి కాలనీలలో జనాభాకు అనుగుణంగా మంచినీరు రావడంలేదని.. వెంటనే సరఫరాను  పెంచాలని ఆదేశించారు. దీంతోపాటు ఇంద్రేశం సత్యసాయి వాటర్ పంప్ హౌస్ సమీపంలో  నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. ఈ సమావేశంలో తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, మిషన్ భగీరథ ఎస్ ఇ రఘువీర్, ఈ ఈ విజయలక్ష్మి, డిఈలు సుచరిత, శ్రీనివాస్, మున్సిపల్ ఏఈ మౌనిక, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa