భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం 'ఆపరేషన్ సింధూర్' చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్లో భారత బలగాలు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. దీనికి ప్రతిస్పందనగా.. పాకిస్తాన్ భారత భూభాగంలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది. భారత భద్రతా దళాలు పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. అంతేకాకుండా, పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఎదురు దాడులు చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో 72వ మిస్ వరల్డ్-2025 పోటీలు మొట్టమొదటిసారిగా జరుగుతున్నాయి. ఈ పోటీలు భారతదేశానికి, అలాగే తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకురానున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మే10న ప్రారంభం కానుండగా.. గురువారం సాయంత్రం వరకు 109 దేశాల నుంచి మిస్ వరల్డ్ పోటీదారులు, నిర్వాహక బృందం, సిబ్బంది హైదరాబాద్ చేరుకున్నారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ సందిగ్ధంలో పడింది. విమాన సర్వీసుల మార్పులు, రద్దుల ప్రభావం పోటీలపై ఉండనుంది.
116 దేశాల నుండి వచ్చే అందాల పోటీదారులకు, స్పాన్సర్లకు, అంతర్జాతీయ మీడియాకు పూర్తి స్థాయి భద్రత కల్పించడం అతిపెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్లోని వ్యూహాత్మక ప్రదేశాలు, సాధారణ ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, వీరికి కూడా రక్షణ కల్పించాల్సి ఉంటుంది. మూడు వారాల పాటు ఇంత పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ అతిథులకు భద్రత కల్పించడం పోలీసు యంత్రాంగానికి పెనుభారంగా మారవచ్చు. షెడ్యూల్ ప్రకారం పోటీదారులు నాగార్జునసాగర్, చార్మినార్, వరంగల్, యాదగిరిగుట్ట వంటి సుదూర ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో వారికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయటం కష్టమైన పని నిపుణులు అంటున్నారు.
భారత్-పాక్ ఉద్రిక్తతల కారణంగా విమాన మార్గాలు మారే లేదా సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉంది. ఇది మిస్ వరల్డ్ పోటీదారుల రాకపోకలపై ప్రభావం చూపవచ్చు. కొందరు మధ్యలో చేరుకునేలా ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ.. హఠాత్తుగా ఏర్పడే అంతరాయాల వల్ల షెడ్యూల్లో మార్పులు చేయాల్సి రావచ్చు. పాకిస్థాన్లోని అమెరికా పౌరుల విషయంలో ట్రంప్ చేసిన సూచనల నేపథ్యంలో.. ఇతర దేశాలు కూడా తమ పౌరుల భద్రత గురించి ఆందోళన చెందుతున్నాయి. ఇది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్పై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ.. హైదరాబాద్లోని కీలక సంస్థలు, ప్రజల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. మూడు వారాల పాటు పూర్తి భద్రత కల్పించడం సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో పోటీల కొనసాగింపుపై కేంద్రం సూచనల మేరకు నడుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa