హైదరాబాద్ మహానగరం ప్రతిష్ఠాత్మక 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలకు వేదికైంది. నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ అందాల పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. విశ్వసుందరి కిరీటం దక్కించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా 110కి పైగా దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మన దేశం తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.ప్రారంభోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాగింది. 'జయజయహే తెలంగాణ' రాష్ట్ర గీతాలాపనతో పోటీలు అధికారికంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా 250 మంది కళాకారులు ప్రదర్శించిన పేరిణి నృత్యం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. పరిచయ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన పోటీదారులు తమ తమ విభిన్న వస్త్రధారణలతో ర్యాంప్పై హోయలొలికించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ ప్రారంభోత్సవ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa