ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఊరు సింగపూర్ అయితది: మల్లారెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 11, 2025, 07:19 PM

మాజీ మంత్రి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జోష్ మామూలుగా ఉండదు. 'పాలు అమ్మినా.. పూలు అమ్మినా.. బోర్ వెల్ నడిపినా.. సక్సెస్ అయిన' అని ఆయన చెప్పే డైలాగ్ సోషల్ మీడియాలో తెగ ఫేమస్. అసెంబ్లీలో అయినా.. పబ్లిక్‌లో అయినా.. ఆయన హడావుడి నెక్స్ట్ లెవల్. ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ.. సందడి చేస్తూ ఉంటారు మల్లారెడ్డి. ఆయన మాటలు, చేష్టలు నవ్వు తెప్పిస్తుంటాయి. మల్లారెడ్డి మాటలు ఒక్కోసారి వివాదాస్పదంగా మారినా.. ప్రజల్లో మాత్రం ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన తనదైన ప్రత్యేకమైన హాస్య చతురతతో సభలను, సమావేశాలను రక్తికట్టిస్తారు. పంచ్‌లు, టైమింగ్ చాలామందిని ఆకర్షిస్తాయి. మెుత్తంగా మల్లారెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సందడి పక్కా అని అంటుంటారు.


ఇక మల్లారెడ్డి కేవలం రాజకీయ నాయకుడే కాదు.. ఒక సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త కూడా. ఆయన అనేక విద్యా సంస్థలను స్థాపించి, వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో పాటు ఇతర ప్రొఫెషనల్ కాలేజీలను కూడా నడుపుతున్నారు. ఈ విద్యా సంస్థలు తెలంగాణలో మంచి పేరు తెచ్చుకున్నాయి. బీఏ డిస్కంటిన్యూ అయిన మల్లారెడ్డి.. పదుల సంఖ్యలో కాలేజీలు, స్కూళ్లు ఎలా ప్రారంభించారన్న దానిపై ఇంట్రెస్టింగ్ విషయాలను ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఓ యూట్యూబర్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మల్లారెడ్డి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


ప్రారంభంలో పాల వ్యాపారం, పూల వ్యాపారం, బోర్‌వెల్ వ్యాపారం చేసిన తాను ఆ తర్వాత అనుకోకుండా విద్యారంగంలోకి అడుగు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఓ మేడం వల్లే తాను మెుదట స్కూల్ ప్రారంభించాల్సి వచ్చిందన్నారు. 'అప్పట్లో.. జోసఫిన్ మేడం అని ఉండే. 1987లో బాలానగర్‌లో మేం ఆమెకు బిల్డింగ్ రెంట్‌కు ఇచ్చినం. అయితే 1988లో స్కూల్ నడపటం నాతో కాదని ఆమె చేతులెత్తేసింది. అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం అధికారంలో ఉంది. ట్యూషన్ ఫీజు రూ. 30 ఉండే.. అయితే రూ.1200 టీచర్లకు స్కేల్ ఇవ్వాలని ఎన్టీఆర్ రూల్ తీసుకొచ్చిండు. 40 మంది పిల్లలు ఉంటే టీచర్ జీతానికే సరిపోకపోయ్యేది. మిగతా మెయింటనెన్స్ విషయంలో ఆమెకు ఇబ్బందులు వచ్చినయ్.


అప్పుడు జోసఫిన్ మేడం స్కూల్‌లో పార్టనర్ తీసుకోవాలని నాకు ఆఫర్ ఇచ్చింది. సరే.. ఆమె చూసుకుంటుంది కదా అని పార్ట్‌నర్‌గా జాయిన్ అయినం. అప్పుడు స్కూళ్లు, విద్యాసంస్థల గురించి ఏం తెల్వదు. అప్పట్నుంచి కంటిన్యూ అయితనే ఉంది. భగవంతుడు ఆ లైన్ చూపించిండు. ఇప్పుడు ఇందాక వచ్చినం. భారత దేశంలోనే మూడు యూనివర్సిటీలు ఉన్న ఏకైక వ్యక్తిని నేను. నా ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్లలో 50 వేల మంది పిల్లలు చదువుతున్నరు. 10 వేల మంది టీచర్లకు నేను జీతాలు ఇస్తున్నా.' అని తన విద్యాసంస్థల ప్రయాణం గురించి చెప్పుకొచ్చారాయన.


ఇక ఫ్యూచర్‌లో మైసమ్మగూడ ప్రాంత ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందుతుందని మల్లారెడ్డి అన్నారు. ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది. నాలుగేళ్లలో ఎవరూ గుర్తించలేని విధంగా మారిపోతుందని చెప్పారు. 'మైసమ్మగూడ నేను పుట్టిన ఊరు.. మా అమ్మమ్మ వాళ్ల ఊరు.. నా జన్మస్థలం. అక్కడ గతంలో 30 ఇండ్లే ఉండే. పూరి గుడిసెలు.. పెంకుటిల్లు.. ఇంకో నాలుగేళ్ల తర్వాత ఆ గ్రామం పూర్తిగా మారిపోతది. ఫారెనర్లు తిరుగుతరు. ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్ అయింది. మరో నాలుగేళ్లలో సింగపూర్, ఆస్ట్రేలియా మాదిరి అయితది. ఎవ్వరూ ఉహించరు.' అని అన్నారు. తనకు జీవితంలో పెద్దగా కోరికలంటూ ఏం లేవని.. తనకు భగవంతుడు అడిగన దాని కంటే ఎక్కువే ఇచ్చాడని ప్రజాసేవ చేయటం, మంచి ఇంజినీర్లు, డాక్టర్లను తయారు చేయటమే తన లక్ష్యమని మల్లారెడ్డి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa