ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాణహిత-గోదావరి లోయలో అద్భుతం.. లోయలో డైనోసార్ అవశేషాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 16, 2025, 07:46 PM

తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో 23 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ అవశేషాలు బయటపడ్డాయి. దీనితో తెలంగాణ చరిత్ర మరో ప్రాచీన యుగానికి చెందినదని వెల్లడైంది. ప్రాణహిత-గోదావరి లోయలోని అన్నారం గ్రామంలో 1980లలో బయటపడిన ఈ రాక్షసబల్లి అవశేషాలు ట్రయాసిక్ యుగానికి చెందిన హేరెరాసారియా జాతికి చెందినవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మాంసాహారి అయిన ఈ డైనోసార్ దక్షిణ అమెరికా వెలుపల కనుగొనడం ఇదే మొదటిసారి. ఈ డైనోసార్‌కు ‘మలేరిరాప్టర్ కుట్టి’ అని పేరు పెట్టారు. మలేరి ఘాట్ల వద్ద ఈ అవశేషాలు లభించడంతో ఆ ప్రాంతం పేరును, కనుగొన్న శాస్త్రవేత్త తారావత్ కుట్టి పేరును కలిపి ఈ పేరు పెట్టారు.


చరిత్రకారుల ప్రకారం.. రాతి యుగానికి ముందు మంచు యుగం, ఆ తర్వాత ఉష్ణయుగం ఉన్నాయి. ట్రయాసిక్ యుగంలో వేడి వాతావరణం కూడా ఉండేదని.. అప్పటి వాతావరణ మార్పులకు అనుగుణంగా డైనోసార్లు ఎలా అభివృద్ధి చెందాయనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. తెలంగాణలో లభించిన ఈ డైనోసార్ అవశేషాలు ఈ పరిశోధనలకు మరింత ఊతమిస్తాయి.


అయితే ఈ పరిశోదనలో వెల్లడైన డైనోసార్ దాదాపు 20 అడుగుల పొడవు ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది ట్రయాసిక్ యుగంలో భూమిపై తిరిగిన తొలి మాంసాహారి డైనోసార్లలో ఒకటిగా తెలుపుతున్నారు. ఈ ఆవిష్కరణ తెలంగాణ చరిత్రను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి సహాయపడనుంది.


భారతదేశంలో డైనోసార్ల ఆనవాళ్ళు చాలా చోట్ల బయటపడ్డాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వీటి అవశేషాలు ఎక్కువగా దొరికాయి. మధ్యప్రదేశ్‌లోని బాగ్‌ లోయలో మొదటిసారిగా డైనోసార్ గుడ్లు కనిపించాయి. గుజరాత్‌లోని బాలాసినోర్ ప్రాంతం కూడా డైనోసార్ల శిలాజాలకు ప్రసిద్ధి. తెలంగాణలో ఇంతకు ముందు కూడా డైనోసార్ అవశేషాలు బయటపడ్డాయి.


ఆదిలాబాద్ జిల్లాలో జురాసిక్ కాలానికి చెందిన సారోపాడ్ జాతి డైనోసార్ ఎముకలు లభించాయి. అయితే.. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొరికిన మలేరిరాప్టర్ కుట్టి అనే మాంసాహారి డైనోసార్ అవశేషాలు చాలా ప్రత్యేకమైనవి. ఇవి ట్రయాసిక్ యుగానికి చెందినవి.. దక్షిణ అమెరికా వెలుపల ఈ జాతి డైనోసార్ ను కనుగొనడం ఇదే మొదటిసారి. ఈ ఆవిష్కరణ డైనోసార్ల పరిణామ క్రమం గురించి మరింత తెలుసుకోవడానికి సహాయపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com