హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ఏర్పాటైన ‘హైడ్రా’ సంస్థ.. వరుస కూల్చివేతలతో తన ఉనికిని చాటుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైనప్పటి నుండి.. హైడ్రాకు వేలాది ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్ రంగనాథ్ స్వయంగా వెల్లడించారు. అక్రమార్కుల చెరలో ఉన్న తమ భూములను విడిపించాలని ఎంతో మంది ప్రజలు హైడ్రాను ఆశ్రయిస్తున్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, భూ ఆక్రమణ నిజమని నిర్ధారించుకున్న తర్వాతే హైడ్రా బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. ఈ పారదర్శక విధానం ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతోంది.
తాజాగా.. మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సర్వే నంబర్ 26ఏలోని సీపీఆర్ఐ పవర్ సంస్థ, సేజ్ స్కూల్ ప్రాంగణంలోని ఆర్ఏఆర్ కాలనీకి సంబంధించిన రహదారిని కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు.. సీఐ సైదులు నేతృత్వంలో జేసీబీలతో రహదారి ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. పీర్జాదిగూడలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఇంకా చాలా ఉన్నాయని, వాటిపై కూడా హైడ్రా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అంతకుముందు.. మే 19న మియాపూర్, హైదర్ నగర్ సమీపంలోని సర్వే నంబర్ 145/3లో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. ఇక్కడ 25 ఏళ్ల క్రితం 9 ఎకరాల 30 గుంటల విస్తీర్ణంలో ‘డైమండ్ హిల్స్’ పేరిట ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయబడింది. ఈ లేఅవుట్లో మొత్తం 79 ప్లాట్లు ఉండగా.. కొందరు వ్యక్తులు వాటిని ఆక్రమించారు. తొమ్మిది నెలల క్రితం హైకోర్టు ఈ స్థలాన్ని హెచ్ఎండిఏ లేఅవుట్గా ధృవీకరించి.. ఆక్రమణదారులను ఖాళీ చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ వారు స్థలాన్ని విడిచిపెట్టకపోవడంతో.. బాధితులు హైడ్రాను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ప్రకారం హైడ్రా ఉదయం నుండి కూల్చివేతలను ప్రారంభించింది. అక్రమ నిర్మాణాలు అని తెలియక వాటిని కొనుగోలు చేసిన కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మణికొండలోని తిరుమల హిల్స్ కాలనీ పార్కులో ఉన్న అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా నేలమట్టం చేసింది. హైడ్రా అధికారుల ఆదేశాలతో అనుమతి లేని కట్టడాలను మణికొండ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. తిరుమల హిల్స్ కాలనీకి చెందిన స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని నిర్ధారణ కావడంతో.. హైడ్రా చీఫ్ రంగనాథ్ కూల్చివేతకు నిర్ణయించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నార్సింగి పోలీసుల భద్రత మధ్య జేసీబీలతో ఆక్రమణలను తొలగించారు. అయితే.. ఈ స్థలం కాలనీ పరిధిలోకి వస్తుందని, తమకు హెచ్ఎండిఏ అనుమతి కూడా ఉందని.. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని కాలనీ వాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై మణికొండ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ స్పందిస్తూ.. ఈ స్థలం తిరుమల హిల్స్ పార్కుకు చెందినదని, అందుకే అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని తెలిపారు.
హైడ్రా వచ్చినప్పటి నుండి హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు గణనీయంగా తగ్గాయని చెప్పాలి. ఈ సంస్థ ప్రజల్లో.. ముఖ్యంగా ఇల్లు కొనుగోలు చేసే వారిలో అవగాహన పెంచి.. అప్రమత్తంగా ఉండేలా చేస్తోంది. హైడ్రా వంటి సంస్థలు తమ జిల్లాలకు కూడా కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారంటే.. ఈ సంస్థ వల్ల ఎంతగానో మేలు జరుగుతోందని అర్థం చేసుకోవచ్చు. ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తూ.. వాటిపై తక్షణమే చర్యలు తీసుకుంటూ హైడ్రా సమర్థవంతంగా పనిచేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa