ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంటికి సిట్ టీమ్ చేరుకుని నోటీసులు అంటించారు. ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్గా ప్రకటించాలని నాంపల్లి కోర్టును పోలీసులు కోరారు. దీనికి సంబంధించి జనవరిలో పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం రెండు రోజుల క్రితం కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రభాకర్ రావు గడువులోపు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కోర్ట్ ఇచ్చిన గడువులోపు హాజరుకాకుంటే ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామని కోర్టు తెలియజేసింది. ప్రభాకర్రావు ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తే ఆయన స్థిర, చర ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది. జూన్ 20 లోపు వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈరోజు (గురువారం) తారామతిలోని ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అందులో భాగంగా పోలీసుల విచారణలో కీలకమైన అంశాలు వెలుగు చూశాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయిన తర్వాత ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నాడు. దీంతో సీబీఐకి తెలంగాణ సీఐడీ లేఖ రాసింది. దీనిపై స్పందించిన సీబీఐ.. ఇంటర్పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. అయినప్పటికీ ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఇండియాకు రాలేదు. దీంతో ఆయన పాస్పోర్టును కూడా సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభాకర్ రావు విచారణకు రాకుండా డుమ్మాకొడుతూ వచ్చారు. మరోవైపు నాంపల్లి కోర్టు గతంలో ప్రభాకర్ రావుకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. దాన్ని తెలంగాణ హైకోర్టులో ప్రభాకర్ రావు సవాల్ చేయగా... అక్కడ కూడా అతడికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కొద్దిరోజుల క్రితమే ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు కూడా ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు దారులన్నీ మూసుకు పోయాయని చెప్పుకోవచ్చు. దీంతో కచ్చితంగా పోలీసుల విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంది. ఒకవేళ కోర్టు ఇచ్చిన గడువులోపు విచారణకు ప్రభాకర్ రావు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa