బంగ్లాదేశ్కు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. "భారతదేశానికి ఒక చికెన్ నెక్ (సిలిగురి కారిడార్) ఉంటే, బంగ్లాదేశ్కు అలాంటివి రెండున్నాయి... మమ్మల్ని దెబ్బతీయాలనుకుంటే మీకే నష్టం" అంటూ ఆ దేశపు వ్యూహాత్మక బలహీనతలను గుర్తుచేశారు. చైనా సహకారంతో బంగ్లాదేశ్ తన లాల్మొనిర్హాట్ వైమానిక స్థావరాన్ని అభివృద్ధి చేస్తుండటం, ఇది భారత్ యొక్క కీలకమైన సిలిగురి కారిడార్కు సమీపంలో ఉండటంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో హిమంత వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సిలిగురి కారిడార్, ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగతా ప్రాంతాలతో కలిపే అత్యంత కీలకమైన, సన్నని భూభాగం. దీనికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో, చైనా ఆర్థిక, సాంకేతిక సహకారంతో లాల్మొనిర్హాట్ వైమానిక స్థావరాన్ని బంగ్లాదేశ్ ఆధునీకరించడంపై భారత్ వ్యూహాత్మక వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.ఈ పరిణామాలపై స్పందిస్తూ, హిమంత బిశ్వ శర్మ, "భారతదేశంపై దాడి చేయాలని ఆలోచించే ముందు బంగ్లాదేశ్ ఒకటికి 14 సార్లు పునరాలోచించుకోవాలి. మాకు ఒక చికెన్ నెక్ ఉంటే, మీకు రెండున్నాయి. మీ చిట్టగాంగ్ ఓడరేవును కలిపే మార్గం మా సిలిగురి కారిడార్ కంటే సన్నగా ఉంది, అది మాకు కేవలం రాయి విసిరేంత దూరంలోనే ఉంది" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత సైనిక శక్తిని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇటీవల పాక్ భూభాగంలోని 11 వైమానిక స్థావరాలను భారత్ ఎలా ధ్వంసం చేసిందో (ఆపరేషన్ సిందూర్) బంగ్లాదేశ్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa