ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీకి వచ్చి అనుభవాలను పంచుకోవాలని కేసీఆర్ కు రేవంత్ విన్నపం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 23, 2025, 05:57 PM

కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని తమ ప్రభుత్వానికి అందించి, సలహాలు ఇవ్వాలని కేసీఆర్ ను కోరారు. "పదవి ఉంటేనే సభకు వస్తామంటే ఎలా మేము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడాలి" అని ఆయన హితవు పలికారు. తాను ముఖ్యమంత్రి అయినా ఏనాడూ అహంకారంతో వ్యవహరించలేదని, మీరు అండగా నిలిస్తే అద్భుతాలు చేసి తెలంగాణను ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.తమ ప్రభుత్వం రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రూ.12 వేలకు పెంచి అందిస్తున్నామని, భూమిలేని కౌలు రైతులకు కూడా సహాయం చేస్తున్నామని తెలిపారు. "గతంలో వరి వేసుకుంటే ఉరేనని ఆనాటి ముఖ్యమంత్రి అన్నారు. కానీ, నేడు మేం వరి పంటకు బోనస్ ఇస్తున్నాం" అని గుర్తుచేశారు. 18 నెలల్లో మహాలక్ష్మి పథకం కోసం రూ.5,500 కోట్లు కేటాయించామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇటీవల జరిగిన మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ప్రతినిధులు కూడా మన రాష్ట్ర మహిళలు తయారుచేసిన వస్తువులను చూసి అభినందించారని పేర్కొన్నారు. మహిళలే బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి కిరాయికి ఇచ్చేలా ఆర్థిక స్వావలంబన చర్యలు తీసుకుంటున్నామని, ఇందిరమ్మ ఆదర్శంగా, సోనియమ్మ స్ఫూర్తితో మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామని భరోసా ఇచ్చారు.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువతకు గత పదేళ్ల పాలనలో ఉద్యోగాలు లభించలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. "తెలంగాణ ఉద్యమంలో నేను ముందున్నానని చెప్పుకున్న వ్యక్తి ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయి" అని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రజలందరూ అండగా ఉంటే ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎన్నిసార్లయినా కలుస్తానని స్పష్టం చేశారు. "చెరువు మీద అలిగితే మనకే వాసన వస్తుంది. ఒకాయన అలాగే అలిగి ఫామ్ హౌస్‌లో పడుకున్నారు" అంటూ ఘాటుగా విమర్శించారు. తాను ప్రజల కోసం నిరంతరం కష్టపడతానని తెలిపారు.జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేస్తామని, వారికి ఇళ్ల పట్టాలు అందించే బాధ్యతను స్థానిక నేత జగ్గారెడ్డికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. "బాధితులకు మంచి భోజనం పెట్టించి జగ్గారెడ్డి పట్టాలు అందిస్తారు" అని తెలిపారు. జహీరాబాద్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత అభివృద్ధి మాత్రమే తమ అజెండా అని స్పష్టం చేశారు. సంజీవ రెడ్డి, సురేష్ షెట్కార్‌లను నారాయణఖేడ్‌కు రెండు కళ్లలాంటి వారని కొనియాడారు. పటాన్‌చెరును మినీ ఇండియాగా అభివర్ణించిన ఆయన, బీహెచ్ఈఎల్, బీడీఎల్, నిమ్జ్, ఇక్రిశాట్ వంటి సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాంతానికి వచ్చాయని గుర్తుచేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా జలాలు హైదరాబాద్ నగర దాహార్తిని తీరుస్తున్నాయని, సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa