ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్ కి ఆర్ధిక సాయం చేసిన అంతర్జాతీయ ద్రవ్య నిధి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 23, 2025, 06:32 PM

పాకిస్థాన్‌కు ఒక బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.8,000 కోట్లు) ఆర్థిక సహాయ ప్యాకేజీని విడుదల చేయడాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి సమర్థించుకుంది. పాకిస్థాన్ అన్ని నిర్దేశిత లక్ష్యాలను చేరుకుందని, అందుకే ఈ తాజా విడత రుణాన్ని అందించినట్లు స్పష్టం చేసింది. భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్ సిందూర్' చేపట్టిన తర్వాత, పాక్ భారత్‌పై కాల్పులకు దిగుతున్న సమయంలోనే ఐఎంఎఫ్ ఈ నిధులను విడుదల చేయడం గమనార్హం.పాకిస్థాన్ తన భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకోవడానికి అనుమతిస్తోందని, ఆ దేశానికి అందిస్తున్న ఆర్థిక సహాయం "ఉగ్రవాదానికి పరోక్షంగా నిధులు సమకూర్చినట్లే" అవుతుందని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు అందిస్తున్న 2.1 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని పునఃపరిశీలించాలని భారత్ ఐఎంఎఫ్ ను కోరింది. కాగా, ఐఎంఎఫ్ ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్ఎఫ్) కార్యక్రమం కింద పాకిస్థాన్‌కు ఇప్పటివరకు రెండు విడతల్లో 2.1 బిలియన్ డాలర్లు అందజేసింది. గత ఏడాది ఈఎఫ్ఎఫ్ కింద 7 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది.తమ నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ జూలీ కొజాక్ మాట్లాడుతూ, "పాకిస్థాన్ నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ చేరుకుందని మా బోర్డు గుర్తించింది. కొన్ని సంస్కరణల్లో పురోగతి సాధించింది, అందుకే బోర్డు ఈ కార్యక్రమానికి ఆమోదం తెలిపింది," అని వివరించారు. సిబ్బంది స్థాయి ఒప్పందం కుదిరిన తర్వాత, దానిని తమ కార్యనిర్వాహక మండలికి సమర్పించామని, మే 9న సమీక్ష పూర్తి చేసి నిధులు విడుదల చేసినట్లు ఆమె తెలిపారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల గురించి ప్రస్తావిస్తూ, ఇరు దేశాల మధ్య శాంతియుత పరిష్కారం కోసం ఆశిస్తున్నట్లు కొజాక్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa