నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామ ప్రజలు పలు మౌలిక సదుపాయాల కొరతతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ రహదారికి ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురికి నీరు రోడ్డుపై పారుతూ, అపరిశుభ్రతకు కారణమవుతోంది. ఈ మురికి వల్ల రోడ్లపై నడక కూడా ప్రమాదకరంగా మారింది.
అంతేకాక, రహదారికి ఇరువైపులా కానుగ కంప చెట్లు పెరిగి దారిని పూర్తిగా ఆక్రమించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గ్రామంలో వీధి లైట్లు చెడిపోయినా వాటి మరమ్మతులు జరగకపోవడం, పారిశుద్ధ్య నిర్వహణ పట్ల సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రజలు మరింత కష్టాల్లో పడుతున్నారు.
ఇక మిషన్ భగీరథ పథకం కింద గ్రామానికి సరఫరా కావాల్సిన తాగునీరు కూడా సక్రమంగా అందకపోవడం, రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పక్కా బస్సు షెల్టర్ లేకపోవడంతో వర్షం, ఎండల మధ్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa