ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రైతులకు శుభవార్త.. ఎకరా భూమికి రూ.1.20 కోట్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 06, 2025, 04:25 PM

తెలంగాణలోని రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. వారికి ఎకరా భూమికి ఏకంగా 1.20 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇంతకు ప్రభుత్వం ఇంత భారీ మొత్తం దేని కోసం చెల్లిస్తుందంటే.. ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చేవారికి. రేవంత్ సర్కార్ వరంగల్‌లో మామునూర్ విమానాశ్రయం నిర్మాణానికి రెడీ అయ్యింది.


ఈక్రమంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో కీలకమైన భూ సేకరణకు లైన్ క్లియర్ అయ్యింది. విమానాశ్రయం నిర్మాణం వల్ల భూములు కోల్పోయే రైతులకు ఒక్కో ఎకరాకు రూ.1.20 కోట్లు చెల్లించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం అధికారలు.. రైతులు, ప్లాట్ల యజమానులతో అనేకసార్లు సమావేశం నిర్వహించి.. చివరకు భూములకు ధర కేటాయించడంలో ఓ నిర్ణయానికి వచ్చారు.


రైతులు ఈ ధరకు అంగీకారం తెలపగా.. వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు, సొంత ప్లాట్లు ఉన్నవారు మాత్రం ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి అంగీకరించడం లేదు. వారికి ఇచ్చే మొత్తాన్నిపెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కొందరు దీనిపై ఇప్పటికే కోర్టులను కూడా ఆశ్రయించారు. అయితే అధికారులు వారిని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


ఎంత భూమి తీసుకున్నారంటే..


మామనూర్ విమానాశ్రయం నిర్మాణానికి 949.14 ఎకరాల భూమి అవసరం ఉంది. అయితే ఈ మొత్తంలో అధిక భాగం అనగా సుమారు 696.14 ఎకరాల భూమి విమానాశ్రయం పరిధిలో ఉంది. మిగతా 280.30 ఎకరాల భూమి అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం 309 మంది రైతుల వద్ద నుంచి 220 ఎకరాల భూమిని సేకరించేందుకు రెడీ అయ్యింది. అలానే మరో 50 మంది నుంచి 61,134.5 గజాల వరకు ప్లాట్లను సేకరించేందుకు సర్కార్ రంగంలోకి దిగింది. ఇక్కడ ప్రభుత్వ భూమి కూడా కొంత ఉంది.


ఇక ఇక్కడ భూముల కొనుగోలు కోసం ప్రభుత్వం.. గతేడాది నవంబర్‌లో ఒకే సారి రూ.205 కోట్లు మంజూరు చేసింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 28న కేంద్ర ప్రభుత్వం.. వరంగల్ మామునూర్ విమానాశ్రయం విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి భూసేకరణ ప్రక్రియ మొదలయ్యింది.


విమానాశ్రయ నిర్మాణానికి భూములు ఇవ్వాల్సిందిగా రైతులను ఒప్పించడానికి ముందుగా వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఇతర ముఖ్య నేతలు అనేకసార్లు సమావేశం నిర్వహించారు. ప్రారంభంలో ఎకరా భూమికి 30 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. రాను రాను ధర పెరుగుతూ పోయింది. 60 లక్షల రూపాయలు చెల్లిస్తామన్నా రైతులు అంగీకరించలేదు. ఆ తర్వాత 80 లక్షలు, కోటి రూపాయలు చెల్లిస్తామన్నా రైతులు భూములు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. చివరకు ఒక్కో ఎకరానికి రూ.1.20 కోట్లు నిర్ణయించడంతో రైతుల భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.


భూములు ఇవ్వడానికి రైతులు ఒప్పుకున్నా.. ఈ ప్రాంతంలో సొంత ప్లాట్లు ఉన్నవారు, వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు మాత్రం నష్టం పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కో గజానికి ప్రభుత్వం సుమారు 6వేల రూపాయల వరకు చెల్లించడానికి ముందుకు రాగా.. ప్లాట్ల యజమానులు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. గజం భూమికి రూ.12-16 వేల రూపాయల వరకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం వీరి ప్రతిపాదనను ఆమోదిస్తుందో లేదో చూడాలి అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa