ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ హెలికాప్టర్‌కు తిప్పలు.. తిరిగి కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు వచ్చిన విమానం

national |  Suryaa Desk  | Published : Sat, Dec 20, 2025, 08:58 PM

పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఊహించని వాతావరణ అంతరాయం ఎదురైంది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ కావడానికి వీలు పడలేదు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా పైలట్లు హెలికాప్టర్‌ను వెనక్కి మళ్లించి తిరిగి కోల్‌కతా విమానాశ్రయానికి చేర్చారు.


అసలేం జరిగిందంటే?


శనివారం ఉదయం పశ్చిమ బెంగాల్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ కోల్‌కతా చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో తాహెర్‌పుర్‌కు బయలుదేరారు. అయితే ప్రస్తుతం ఉత్తర భారత దేశంతో పాటు తూర్పు రాష్ట్రాలను కప్పేసిన దట్టమైన పొగమంచు.. ప్రధాని పర్యటనపై ప్రభావం చూపింది. హెలికాప్టర్ తాహెర్‌పుర్ హెలిప్యాడ్ సమీపానికి చేరుకున్నప్పటికీ.. అక్కడ విజిబులిటీ అత్యంత తక్కువగా ఉండటంతో ల్యాండింగ్‌కు సాధ్యపడలేదు.


దీంతో పొగమంచు పొరల మధ్య హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడానికి పైలట్లు కొంతసేపు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సురక్షితమైన ల్యాండింగ్‌కు అవసరమైన కనీస విజిబిలిటీ లేకపోవడంతో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పైలట్లు వెనక్కి వెళ్లడమే ఉత్తమమని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రధాని హెలికాప్టర్ తిరిగి కోల్‌కతా విమానాశ్రయానికే చేరుకుంది. హెలికాప్టర్ వెనక్కి మళ్లిన తర్వాత ప్రధాని మోదీ కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయారు. వాతావరణం కాస్త తేరుకుని.. పొగమంచు విడిపోయే వరకు ఆయన అక్కడే వేచి చూశారు. వాతావరణ శాఖ అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ.. పరిస్థితులు అనుకూలించిన తర్వాత మళ్లీ తన ప్రయాణాన్ని కొనసాగించాలని ప్రధాని భావించినట్లు అధికారులు వెల్లడించారు.


ప్రధాని వంటి అత్యున్నత స్థాయి వ్యక్తుల పర్యటనలో భద్రతా ప్రమాణాలు అత్యంత కఠినంగా ఉంటాయి. అందుకే విజిబులిటీ తక్కువగా ఉన్నప్పుడు ల్యాండింగ్ చేయడం ప్రమాదకరమని భావించిన ఎయిర్ ఫోర్స్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల విమాన, రైలు ప్రయాణాలకు అంతరాయం కలుగుతున్న తరుణంలో ప్రధాని పర్యటనలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతానికి వాతావరణం మెరుగుపడే వరకు ప్రధాని పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa