హైదరాబాద్ మహానగరంలో సైబర్ నేరగాళ్లు అమాయకులను, ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకొని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి, ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులను కొట్టేస్తున్నారు. ఇటీవల నగరానికి చెందిన ఒక విద్యార్థినిని లక్ష్యంగా చేసుకొని రూ.1.27 లక్షలు కాజేశారు. ఈ సంఘటన సైబర్ నేరగాళ్లు ఎంత చాకచక్యంగా, ఆధునిక పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారో మరోసారి తెలియజేస్తోంది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సైబర్ క్రైమ్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 24 ఏళ్ల ఒక విద్యార్థినిని మోసగాళ్లు మొదట 'జీపీ డిస్కషన్ 063' అనే ఒక వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూప్లో చేర్చారు. ఈ గ్రూప్లో 'గోద్రేజ్ ప్రాపర్టీస్' వంటి సంస్థల్లో పెట్టుబడులు పెడితే అరగంటలోనే అధిక లాభాలు వస్తాయని, రోజుకు కనీసం రూ.5 వేలు సంపాదించుకోవచ్చని నమ్మబలికారు. ఈ ప్రలోభాలకు గురైన బాధితురాలు, మొదట రూ.10 వేలు పెట్టుబడిగా పెట్టింది. సైబర్ నేరగాళ్లు ఆమె నమ్మకాన్ని చూరగొనడానికి, అరగంటలోనే రూ.5 వేలు లాభంతో మొత్తం రూ.15 వేలు ఆమె ఖాతాలో జమ చేశారు.
ఈ ప్రారంభ లాభంతో ఉత్సాహంగా, నమ్మకంతో నిండిన బాధితురాలు, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడింది. ఆ తర్వాత రూ.31,572 పెట్టుబడి పెడితే అరగంటలో రూ.70 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆ మొత్తాన్ని కూడా జమ చేయడంతో, విద్యార్థిని పూర్తిగా మోసగాళ్ల వలలో చిక్కుకుంది. దీంతో ఆమె ఉత్సాహంగా విడతల వారీగా మొత్తం రూ.1,27,354 వారికి చెల్లించింది. డబ్బులు అందుకున్న వెంటనే.. సైబర్ నేరగాళ్లు ఆ మొత్తాన్ని కాజేసి ఎటువంటి సమాచారం లేకుండా అదృశ్యమయ్యారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అరగంటలో రూ.6.5 కోట్లు ఆవిరి.. డేటింగ్ యాప్లో పరిచయం.. అతడిని నిండా ముంచింది..
ఇలాంటి ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలు తరచుగా నకిలీ వెబ్సైట్లు, మోసపూరిత యాప్లు, మరియు భారీ లాభాల ఆశ చూపడం ద్వారా జరుగుతాయి. మొదట చిన్న మొత్తంలో లాభాలు చూపించి బాధితుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహిస్తారు. డబ్బులు అందగానే, ఆ వెబ్సైట్లు లేదా యాప్లు పనిచేయడం మానేస్తాయి, లేదా బాధితులను బ్లాక్ చేస్తారు.
చాలా సందర్భాల్లో.. ఈ మోసగాళ్లు విదేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తుంటారు.. వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారుతుంది. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని హామీ ఇచ్చే ఎలాంటి పథకాలనైనా నమ్మవద్దని.. షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్లో లాభనష్టాలుంటాయని చెప్పే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తెలియని వాట్సాప్ లేదా టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అపరిచితులు పంపే పెట్టుబడి గ్రూపుల్లో చేరవద్దని సలహాలు ఇస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa