ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరమ్మ లబ్దిదారులకు .. అదనంగా రూ.లక్ష సాయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 14, 2025, 06:44 PM

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది ఇందిరమ్మ ఇళ్లు. దీనిలో భాగంగా సొంతిల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి స్థలం మాత్రమే కాక రూ.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. నిర్మాణాలు కూడా మొదలయ్యాయి.


మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో శుభవార్త చెప్పారు. వారికి అదనంగా మరో రూ.లక్ష సాయం అందిస్తామని వెల్లడించారు. ఆ వివరాలు..


తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన చేశారు. లబ్ధిదారులకు మరో శుభవార్త చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షలతో పాటు అదనంగా మరో లక్ష రూపాయలు రుణం ఇప్పిస్తామని తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. లబ్ధిదారులంతా ఎలాంటి ఆటంకాలు లేకుండా 400- 600 చదరపు అడుగుల్లోపు తమకు నచ్చినట్లు సొంతింటిని నిర్మించుకోవచ్చని తెలిపారు. ఇళ్లు కట్టుకునే స్థోమత లేని వారికి మహిళా సంఘాల నుండి అదనంగా మరో లక్ష రూపాయల ఆర్థిక సాయం కూడా అందిస్తామని వెల్లడించారు.


అయితే నేటి కాలంలో రూ.5లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి చేయడం అంటే చాలా కష్టమైన పని. ప్రస్తుతం అన్నింటి ధరలు భారీగా పెరిగాయి. నిర్మాణ వ్యయం కూడా అందుకు తగ్గట్టుగానే పెరిగింది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న రేవంత్ సర్కార్.. ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఒక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించుకుంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రతి లబ్ధిదారుడికి 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా ఇవ్వనున్నారు.


అయితే ఫ్రీ ఇసుకు ఆఫర్ పొందాలంటే.. కచ్చితంగా గ్రామ కార్యదర్శి నుంచి ఆమోదం పొందాలి. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి మండల ఎమ్మార్వో కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని పరిశీలించిన ఎమ్మార్వో టోకెన్లు జారీ చేస్తారు. వీటిని తీసుకెళ్లి లబ్ధిదారులు వారి గ్రామానికి సమీపంలోని వాగుల్లో, ఇసుక రీచ్‌ల ద్వారా ఉచితంగా 8 ట్రాక్టర్ల ఇసుకను తీసుకోవచ్చు. అయితే ఇసుకు రవాణాకు అయ్యే ఖర్చును లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa