హైదరాబాద్లో జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొని, విజేతలకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి, ప్రోత్సాహానికి తోడ్పాటునందిస్తూ, అందరికీ సముచిత గుర్తింపు కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. 14 ఏళ్ల క్రితం ఆగిపోయిన నంది అవార్డుల సంప్రదాయాన్ని 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్' పేరుతో పునరుద్ధరించినట్లు ఆయన చెప్పారు. నిర్మాత దిల్రాజు సూచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, తెలుగు సినిమా గతంలో చెన్నై కేంద్రంగా ఉండగా, ఇప్పుడు హైదరాబాద్ను భారతీయ సినీ పరిశ్రమకు కేంద్రంగా నిలిపినందుకు సినీ ప్రముఖులను అభినందించారు. ఎన్టీఆర్, ఏయన్నార్ నుంచి పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి నాలుగో తరం నటుల వరకు తెలుగు సినిమా గొప్ప వారసత్వాన్ని కొనసాగిస్తోందని ఆయన కొనియాడారు.
సినీ పరిశ్రమకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్నా, అది పరిశ్రమను ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికేనని సీఎం స్పష్టం చేశారు. 'తెలంగాణ రైజింగ్-2047' నినాదంతో రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని, ఇందులో సినీ పరిశ్రమ కీలక భాగస్వామిగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రాజమౌళి వంటి దర్శకులు హాలీవుడ్ స్థాయి చిత్రాలను హైదరాబాద్ నుంచి నిర్మించాలని, అందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. గద్దర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం సాధించామని, ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం గర్వకారణమని తెలిపారు. రాహుల్ సిప్లిగంజ్ వంటి ఆస్కార్ విజేతలను ప్రోత్సహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. సినీ పరిశ్రమతో కలిసి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామని, 2047 విజన్ డాక్యుమెంట్లో సినిమాకు ప్రత్యేక అధ్యాయం కేటాయిస్తామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa