హైదరాబాద్ మహానగరంలో కల్తీ ఆహారం, నాణ్యత లేని వంటకాల వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఎక్కడ చూసినా ఇష్టారీతిగా నడుస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, చిన్నపాటి ఆహార విక్రయ కేంద్రాలలో కల్తీ పదార్థాల కలకలం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆహార భద్రత అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నా.. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారి సంఖ్య తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ తనిఖీలను మరింత విస్తృతం చేశారు. ఇప్పటివరకు రెస్టారెంట్లు, హోటళ్లపై దృష్టి సారించిన అధికారులు, ఇప్పుడు స్వీట్ షాపులు, చిన్న హోటళ్లు, సమోసాలు, స్నాక్స్ సెంటర్లపై కూడా ఉక్కుపాదం మోపుతున్నారు.
గోల్కొండలో సమోసా సెంటర్ సీజ్ ..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ విభాగం గోల్కొండలోని ఒక సమోసా సెంటర్ను సీజ్ చేసింది. గోల్కొండ ఫోర్ట్ సమీపంలో.. నిబంధనలకు విరుద్ధంగా, అపరిశుభ్ర వాతావరణంలో ఈ సమోసాల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బడా బజార్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండానే నిర్వాహకులు సమోసాలను తయారు చేస్తున్నారు.
దీంతో స్థానిక ప్రజల నుంచి GHMCకి అనేక ఫిర్యాదులు అందాయి. కమిషనర్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఎలాంటి లైసెన్స్ లేకుండా, అపరిశుభ్రమైన వాతావరణంలో సమోసాల తయారీ జరుగుతున్నట్లు కనుగొన్నారు. అంతేకాకుండా, సమోసాల తయారీకి కల్తీ, నాణ్యత లేని ఆహార పదార్థాలను వాడుతున్నట్లు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి కేంద్రాలను గుర్తించి సీజ్ చేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
నగరంలో ఆహార భద్రత..
ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో బయట ఏం తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఏ ఆహారంలో ఏ పదార్థాలు కలుపుతున్నారో, ఎలాంటి రసాయనాలను వాడుతున్నారో తెలిస్తే వాటిని తినలేం. వాటి తయారీ విధానాలు, అపరిశుభ్రత చూస్తేనే వాంతులు వచ్చేలా ఉంటాయి. పుడ్ సేఫ్టీ అధికారులు తరచుగా జరుపుతున్న తనిఖీల్లో వెల్లడవుతున్న విషయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆహార రంగుల మితిమీరిన వాడకం, గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులు, నిల్వ ఉంచిన పదార్థాలు, కల్తీ నూనెలు, మరియు అపరిశుభ్రమైన నీటి వాడకం వంటివి ప్రధాన సమస్యలు. ఇవి జీర్ణకోశ సమస్యల నుంచి తీవ్రమైన అనారోగ్యాలకు, విషాహారానికి దారితీస్తున్నాయి.
ఆహార భద్రత ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి, అధికారులు నిరంతర తనిఖీలు చేపట్టడమే కాకుండా, కఠినమైన శిక్షలు అమలు చేయాలి. వినియోగదారులు కూడా తమకు అనుమానం వచ్చినప్పుడు వెంటనే ఫిర్యాదు చేయడానికి వెనుకాడకూడదు. నాణ్యత ప్రమాణాలను పాటించని దుకాణాలు, హోటళ్లపై చర్యలు తీసుకోవడం ద్వారానే ప్రజలు సురక్షితమైన ఆహారాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా, ఆహార భద్రత, పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడం కూడా అత్యంత అవశ్యకం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa