'మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు.. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు.. యాడ వున్నాడో కాయాన్ని కంటికి కానరాడు' అంటూ ఓ ప్రముఖ కవి రాసిన ఈ గేయం ప్రస్తుత సమాజానికి అతికినట్లు సరిపోతుంది. మనిషిలో మానవత్వం రోజు రోజుకూ చచ్చిపోతుంది. కొందరిలో అది మచ్చుకైనా కానరావటం లేదు. కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వకపోగా.. వారిని మరింత హింసిస్తున్నారు. ఈ సమాజంలో ప్రశాంతమైన చావు కూడా దొరకటం లేదు. తాజాగా.. జగిత్యాల పట్టణంలో హృదయాలను ద్రవింపజేసే ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ.. పరిస్థితి విషమంగా ఉన్న ఓ వ్యక్తిని అద్దె ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వలేదు. తన ఇంట్లో చనిపోతే ఏదో అయిపోతుందనే మూఢ నమ్మకంతో మానవత్వం లేకుండా ప్రవర్తించాడు. దీంతో గత్యంతరం లేక కుటుంబ సభ్యులు బతికుండానే అతడ్ని శ్మశానానికి తీసుకెళ్లారు. అతడి చావు కోసం బంధువులు ఎదురు చూశారు.
వివరాల్లోకి వెళితే.. ధర్మపురి పట్టణానికి చెందిన రంగు గోపి అనే యువకుడు హోటల్ నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. అతడికి సొంతిల్లు లేకపోటవంతో పట్టణంలోని ఓ ఇంట్లో కుటుంబంతో కలిసి అద్దెకు ఉండేవాడు. అయితే ఇటీవల గోపి తీవ్ర అనారోగ్యానికి గురై ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో వైద్యులు చేతులెత్తేశారు. చివరి స్టేజీలో ఉన్నాడని.. బతికించలేమని ఇంటికి తీసుకెళ్లమని డాక్టర్లు సూచించారు. దీంతో గోపి కుటుంబ సభ్యులు అతన్ని ధర్మపురిలోని అద్దె ఇంటికి తీసుకువచ్చారు. అయితే అద్దె ఇంటి యజమాని గోపిని ఇంట్లోకి అనుమతించలేదు. తన ఇంట్లో చనిపోతే కీడు జరుగుతుందని భావించి ఎక్కడికైనా తీసుకెళ్లాలని సూచించాడు. కుటుంబ సభ్యులు బతిమిలాడినా రాయిలాంటి ఆ గుండె కరగలేదు.
దీంతో ఏ చేయాలో తెలియక కుటుంబ సభ్యులు గోపిని బతికుండానే పట్టణ శివారులోని శ్మశాన వాటికకు తరలించారు. అక్కడే అతనికి సపర్యలు చేశారు. అతని చావు కోసం బంధువులు ఎదురు చూడాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. శ్మశానంలో నిస్సహాయ స్థితిలో ఉన్న గోపి కుటుంబం గురించి తెలుసుకున్న పట్టణంలోని మున్నూరు కాపు సంఘ సభ్యులు చలించిపోయారు. తక్షణమే స్పందించి గోపిని, అతని కుటుంబ సభ్యులను తమ సంఘ భవనంలోకి తరలించి ఆశ్రయం కల్పించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గోపి కుటుంబానికి కొంత ఆర్థికసాయం చేశారు.
అయితే, గోపి కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అతడి కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సొంత ఇల్లు లేక ఇబ్బందుల్లో ఉన్న ఇలాంటి నిరుపేద కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వారికి గృహ వసతి కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సమయంలో మనిషి జీవితంలో సొంత ఇల్లు ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa