రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ, మధ్య మహారాష్ట్ర దుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు, ఇది సముద్రమట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని అధికారులు తెలిపారు. ఈ వాతావరణ వ్యవస్థ దక్షిణ-పశ్చిమ దిశగా వాలి ఉన్నదని, మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు. శనివారం ఉత్తరాంధ్ర తీరాన్ని ప్రభావితం చేసిన పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆవర్తనం, తాజాగా వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త ఆవర్తనంలో కలిసిపోయిందని తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ, ఉత్తర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు సూచించారు. దక్షిణ ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణాలో కూడా మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సోమవారం నాడు ఉత్తర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే సగటున 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa