కులగణన చేపట్టాలనే డిమాండ్తో అవసరమైతే రోడ్లెక్కి యుద్ధం చేయడానికి కూడా సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు సంచలన ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కేవలం జనగణన గురించి మాట్లాడుతోందని, కులగణన ప్రస్తావన తీసుకురావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ, "కేంద్రం చేపడుతున్న జనగణన వల్ల బీజేపీకి తప్ప మరెవరికీ ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలైన బీసీలకు దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు" అని అన్నారు. కులగణన ఆవశ్యకతను అన్ని రాజకీయ పార్టీలు గుర్తించి, దానికోసం గళం విప్పాలని ఆయన కోరారు.మరోవైపు, దేశంలో దాదాపు 16 సంవత్సరాల విరామం తర్వాత జరగనున్న జనగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది. దేశ చరిత్రలో ఇది 16వ జనగణన కాగా, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేపడుతున్న 8వది కావడం గమనార్హం.జనగణన తొలి దశలో భాగంగా హిమాలయ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లడక్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో 2026 అక్టోబర్ 1వ తేదీ వరకు జనగణన పూర్తి చేయనున్నారు. రెండో దశలో, 2027 మార్చి 1వ తేదీ నాటికి దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన పూర్తి చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. అయితే, ఈ జనగణనలో కులాల వారీగా వివరాలు సేకరిస్తారా లేదా అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో వీహెచ్ వంటి నేతలు కులగణన కోసం పట్టుబడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa