ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బనకచర్ల వల్ల తెలంగాణకు జరిగే నష్టంపై మంత్రి మౌనంగా ఉన్నారన్న ఎంపీ అర్వింద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 18, 2025, 05:55 PM

బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో చెప్పమంటే మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వద్ద సమాధానం లేదని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆయన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారని అర్వింద్ ఆరోపించారు.బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, "బీజేపీ భరోసా కార్యక్రమం ద్వారా ఎన్నో వినతిపత్రాలు స్వీకరించాం. ముఖ్యంగా చాలా మంది దివ్యాంగులు వచ్చి వారి సమస్యలను మాతో పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారికిచ్చిన హామీలను కూడా నెరవేర్చడంలో విఫలమైంది. దీనివల్ల ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతింది" అని అన్నారు.మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యవహార శైలిపై అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సగం కాంగ్రెస్, సగం బీఆర్ఎస్ వ్యక్తిలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి దర్శకత్వంలోనే తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు ఆయన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదంతా కేవలం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆడుతున్న నాటకం" అని అర్వింద్ ఆరోపించారు. బీజేపీ మీద బురద చల్లేందుకే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనా అర్వింద్ స్పందించారు. "నన్ను సిట్ విచారణకు పిలిచినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. నాకు ఎలాంటి నోటీసులు అందలేదు. అసలు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఫోన్‌ను ఎందుకు ట్యాపింగ్‌ చేశారో అర్థం కావడం లేదు" అని అర్వింద్ వ్యాఖ్యానించారు. బనకచర్ల విషయంలో వాస్తవాలు మాట్లాడకుండా, పవర్ పాయింట్ ప్రజంటేషన్లతో కాలయాపన చేయడం ద్వారా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించాలని అర్వింద్ హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa