ఉపాధి కోసం సుదూర దేశం వెళ్లిన తెలంగాణ వాసి. ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అకాల మరణం చెందాడు. జగిత్యాల జిల్లాకు చెందిన రవీందర్ అనే వ్యక్తి ఇజ్రాయెల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బతుకుదెరువు కోసం రెండు సంవత్సరాల క్రితం రవీందర్ ఇజ్రాయెల్ వెళ్లాడు.పూర్తి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడ జరుగుతున్న భీకర బాంబు దాడుల శబ్దాలకు రవీందర్ తీవ్ర ఆందోళనకు గురై గుండెపోటుతో మృతి చెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఇక, ఈ వార్త విన్నప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవడానికి వెళ్లిన వ్యక్తి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం వారిని తీవ్రంగా కలచివేసింది.యుద్ధ పరిస్థితుల కారణంగా ఇజ్రాయెల్కు విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రవీందర్ మృతదేహాన్ని స్వదేశానికి ఎలా తీసుకురావాలనే విషయంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాము దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ప్రభుత్వం చొరవ తీసుకుని తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని రవీందర్ భార్య కన్నీటిపర్యంతమవుతూ వేడుకుంటున్నారు. అంతేకాకుండా తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కూడా ఆమె ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. విదేశాల్లో ఉన్న తమ వారి భద్రత గురించి తోటి వలస కార్మికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి రవీందర్ కుటుంబానికి అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa