తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక సమావేశాలతో రెండు రోజుల పర్యటనను ముగించుకుని ఈ రోజు హైదరాబాద్ తిరిగి చేరుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, పార్టీ వ్యూహాలను సిద్ధం చేయడం, కేంద్ర మంత్రులతో రాష్ట్రాభివృద్ధిపై చర్చించడం వంటి అనేక అంశాలపై ఆయన ఢిల్లీలో సమాలోచనలు నిర్వహించారు. కేంద్రంలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల నెక్టరవ్యూలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచనపై అధిష్ఠానంతో చర్చించనున్నారు. కేవలం ఎన్నికల వ్యూహంపైనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారని సమాచారం. ముఖ్యంగా కులగణన అంశాన్ని జాతీయ అంశంగా మలచాలని, రాష్ట్రంలో విజయవంతంగా పూర్తిచేసిన అనుభవంతో కేంద్రాన్ని ప్రభావితం చేయాలనే లక్ష్యం ఆయనది. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో రైతులు, యువత, మహిళలు తదితర వర్గాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, 'తెలంగాణ రైజింగ్ 2047' దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. టోనీ బ్లెయిర్ స్థాపించిన “ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్”తో తెలంగాణ ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ మార్చుకోవడం ద్వారా భవిష్యత్ వ్యూహాలకు మద్దతు కూడగట్టే దిశగా అడుగులు వేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్లతో కూడా సీఎం రేవంత్ సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు త్వరితగతిన ఆమోదం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. రూ.24,269 కోట్ల విలువైన 76.4 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టును కేంద్రంతో కలిసి ఉమ్మడిగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబరులో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోనుండగా, "ప్రోగ్రెస్ రిపోర్ట్" ను ప్రజల ముందుంచే కార్యక్రమాన్ని, భారీ బహిరంగ సభల ద్వారా ప్రారంభించాలన్నది సీఎం ఆలోచన. ఈ సభలకు ముఖ్య అతిథులుగా AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లను ఆహ్వానించేందుకు సమయాన్ని ఖరారు చేయాలని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa