ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు భరోసాలో కొత్తగా 1.4లక్షల మంది.. త్వరలోనే వారందరి ఖాతాలో డబ్బులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 21, 2025, 07:41 PM

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. నేటి (శనివారం) వరకు పది ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో తొలి విడత రైతు భరోసా నిధులు జమ చేసింది. రైతు భరోసా కింద రైతులకు 9 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయ్యిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.


అంతేకాక రైతు భరోసాకు అర్హులై.. ఖాతాలో డబ్బులు పడని వారు, జూన్ 5 వరకు భూ యాజమాన్య హక్కులు పొందిన వారు కూడా రైతు భరోసాకు అప్లై చేసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.


రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవడానికి నిన్నటితో (జూన్ 20, శుక్రవారం) గడువు ముగిసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 1.40 లక్షల మంది రైతులు.. కొత్తగా రైతు భరోసాలో చేరారని.. వీరంతా ఈ ఖరీఫ్ సీజన్‌లోనే అప్లై చేసుకున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇచ్చిన గడువులోగా ధ్రువపత్రాలు సమర్పించిన అన్నదాతలకు ఈ సీజన్‌లోనే రైతు భరోసా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొత్తగా నమోదు చేసుకున్న రైతులకు కూడా ఎకరాలతో సంబంధం లేకుండా.. రైతు భరోసా చెల్లిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.


ఇదిలా ఉంటే రేవంత్ సర్కార్ జూన్ 16, సోమవారం నుంచి రైతు భరోసా కార్యక్రమం మొదలుపెట్టింది. నాటి నుంచి రోజుకో ఎకరం చొప్పున పెంచుతూ రైతు భరోసా నిధులు జమ చేస్తున్నారు. శుక్రవారం నాటికి 7ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చేశారు. శనివారం నాడు 10 ఎకరాల వరకు రైతుల ఖాతాలో నిధులు జమ అయ్యాయి.


అయితే పాత రైతులకు సంబంధించిన చెల్లింపులు మొత్తం పూర్తయ్యాకే కొత్త రైతులకు రైతు భరోసా డబ్బులు చెల్లించే అవకాశం ఉందంటున్నారు. అయితే వీరికి కూడా ఎకరాల వారీగా డబ్బులు జమ చేస్తారా.. లేదంటే కొత్త వారందరి ఖాతాలో వారి పేరు మీద ఎంత భూమి ఉంది అనే ప్రకారం నిధులు జమ చేస్తారా అనే దానిపై క్లారిటీ లేదు.


ఇక శుక్రవారం నాడు 2.64 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.906కోట్లు జమ చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇప్పటివరకు 65.12 లక్షల మంది రైతులు రైతు భరోసా సహాయాన్ని అందుకున్నారని తెలిపారు. ఎలాంటి పరిమితి విధించకుండా రైతు భరోసా సాయం అందిస్తున్నామని వివరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa