ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 22, 2025, 07:48 PM

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం చల్లబడనుంది. రాబోయే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని, ఇది నిప్పులు చెరిగే వేసవి నుంచి ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా.. కొన్ని జిల్లాలకు పిడుగులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలపై ప్రత్యేక హెచ్చరికలు జారీ అయ్యాయి.


భారత వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. ఈ జిల్లాల్లో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పిడుగుల ప్రమాదం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్ల కింద ఆశ్రయం పొందరాదని హెచ్చరించారు.


  మిగిలిన జిల్లాల్లోనూ ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ వర్షాలు వేడి గాలుల నుంచి ఉపశమనాన్ని ఇవ్వడమే కాకుండా.. భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి కూడా దోహదపడతాయి. తెలంగాణకు రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత కొన్ని రోజుల వరకు భారీగా వర్షాలు కురిసినా.. తర్వాత కొన్ని రోజులు ఎండలతో ప్రజలు సతమతం అయ్యారు. తర్వాత మళ్లీ వర్షాలు ఎక్కుగా కురవలేదు. నేటి నుంచి మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ భారీ వర్షాలు వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా వానాకాలం పంటల సాగుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.


హైదరాబాద్, దాని పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ కావడంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లో కురిసే వర్షాల వల్ల ట్రాఫిక్ అంతరాయాలు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉంది. నగరపాలక సంస్థలు, ట్రాఫిక్ పోలీసులు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.


పిడుగులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. ఇంట్లో ఎలక్ట్రికల్‌కు సంబంధించి పరికరాలు వాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈదురు గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa