హైదరాబాద్ నగరంలో ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. నగరంలో ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హస్పిటల్ ఎంతో మందికి ప్రాణ దానం చేస్తుంది. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న వారికి మెరుగైన చికిత్స అందించి.. వారికి నూతన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఈ ఆస్పత్రి స్థాపించి నేటికి 25 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈక్రమంలో ఆస్పత్రి 25వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభించి పాతిక సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు హైదరాబాద్లో ఆస్పత్రి 25వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఛైర్మన్ బాలకృష్ణతో పాటుగా.. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనో.. లేక భారీగా లాభాలు ఆర్జించాలనే ఆశతోనో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించలేదని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. తమకు కలిగిన వ్యక్తిగత నష్టం నుంచి పుట్టిన ఆలోచనల్లో నుంచే బసవతారకం క్యాన్సర్ ఆప్పత్రి పుట్టుకొచ్చిందని చెప్పుకొచ్చారు. తమ తల్లి క్యాన్సర్తో మరణించడం వల్ల.. అందరికీ క్యాన్సర్ చికిత్స అందించాలని ఉద్దేశంతో.. తమ తండ్రి ఎన్టీఆర్ ఈ క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించారు అని బాలయ్య గుర్తు చేసుకున్నారు.
ప్రారంభంలో ఈ ఆస్పత్రి కేవలం 110 పడకలతో మొదలై.. నేడు దేశంలోనే అత్యున్నత ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుందని బాలకృష్ణ తెలిపారు. త్వరలోనే 1000 పడకలతో అమరావతిలోనూ క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. తమకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తోన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, సీఎంలకు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలయ్య.. తనకు దామోదర రాజ నరసింహ పేరుతో ఒక సినిమా చేయాలని ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ.. తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు.. ప్రతి ఏటా 50-55 వేల మంది క్యాన్సర్ బారినపడుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రతి జిల్లాల్లోనూ క్యాన్సర్ చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నారు.
బసవతారకం హాస్పిటల్ మొదలైనప్పటి నుంచి క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స అందిస్తూ వస్తోంది. పాతిక సంవత్సరాల క్రితం అనగా.. 2000 సంవత్సరంలో.. సుమారు 110 బెడ్లతో మొదలైన ఈ ఆస్పత్రి నేడు 650 బెడ్ల సామర్థ్యంతో దేశంలోని ప్రముఖ క్యాన్సర్ చికిత్సా కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ అందించే అత్యుత్తమ వైద్య సేవలు, సబ్సిడీ రేట్లకే చికిత్స అందిండం వంటి అంశాలు దీన్ని వరల్డ్ క్లాస్ హాస్పిటల్గా నిలుపుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa