అసెంబ్లీ ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదవ సంఘం నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో ఆందోళన చేశారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని, క్యాబినెట్ లో యాదవ వర్గానికి ప్రాతినిథ్యం కల్పించాలని నినాదాలు చేశారు. పీసీసీ కార్యవర్గంలో యాదవులకు ప్రాధాన్యత తగ్గిందని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. వ్యాన్ లో గొర్రెలను తీసుకొని వచ్చి గాంధీ భవన్ ఆవరణలో నిరసన తెలిపారు. అనంతరం గొర్రెలను గాంధీ భవన్ లోపలికి పంపించేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, గొల్ల కురుమల నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం గొల్ల కురుమల సంక్షేమ సంఘం నాయకులు గాంధీ భవన్ వెలుపల నిరసన వ్యక్తం చేశారు. గొల్ల కురుమల నేతలు చేపట్టిన ఈ నిరసనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఈ వీడియోను షేర్ చేస్తూ.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం మేనిఫెస్టోలో ఊదరగొట్టిందని విమర్శించారు. అయితే, గొర్రెల పంపిణీ మాట దేవుడెరుగు, వాటికోసం కట్టిన డీడీ పైసలు కూడా వాపస్ ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాటలు వినీ వినీ విసిగిపోయిన యాదవ, కురుమ సోదరులు గాంధీ భవన్ కు గొర్రెలు తోలుకొని వచ్చి నిరసన తెలియజేశారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa